Alleti Maheshwar Reddy Officially Joined in BJP Party - Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌తో ఇబ్బంది లేదు కానీ..

Apr 13 2023 2:17 PM | Updated on Apr 13 2023 4:56 PM

Alleti Maheshwar Reddy Joins BJP - Sakshi

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అధికారికంగా బీజేపీలో చేరారు

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అధికారికంగా బీజేపీలో చేరిపోయారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, మహేశ్వర్‌రెడ్డికి కండువా కప్పి బీజేపీలోకి స్వాగతించారు. అంతుకు ముందు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌ చుగ్‌ మహేశ్వర్‌రెడ్డికి శాలువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. 

బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, సంగప్ప తదితరులు మహేశ్వర్‌రెడ్డిని వెంట పెట్టుకుని మహేశ్వర్‌ను తరుణ్‌ చుగ్‌కు కలిపించారు. కాంగ్రెస్‌ రాజీనామా ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

రేపు(శుక్రవారం) మంచిర్యాలలో కాంగ్రెస్‌ సభకు  ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇంతలోనే మహేశ్వర్‌రెడ్డి తన రాజీనామాను ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేకు పంపడం గమనార్హం. టీపీసీసీ ఛీప్‌ రేవంత్‌రెడ్డితో పొసగకపోవడం, నోటీసుల నేపథ్యంలో నొచ్చుకుని ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

నా విషయంలోనే ఇలా చేశారు:  ఏలేటి మహేశ్వర్ రెడ్డి
బీజేపీలో చేరాక మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. పొత్తులపై నేతలు తలో మాట మాట్లాడుతున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. కొంతమంది కోవర్టులున్నారని కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఎవరికోసం పనిచేస్తున్నారో తెల్వడం లేదు. నా మీద సోషల్ మీడియాలో నిందలు మోపారు. 

గంటలోపల బదులు ఇవ్వమని నోటీసులు ఇవ్వడం దారుణం. నా ఒక్కడి విషయంలోనే అలా జరిగింది. నాకు కాంగ్రెస్ లో నిత్యం అనుమానాలు, అవమానాలే ఎదురైయ్యాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలోనే తెలంగాణ ప్రజలకు విముక్తి వస్తుందనే నమ్మకం ఉంది. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తా. కాంగ్రెస్‌తో నాకు ఇబ్బంది లేదు. ఎప్పుడూ పార్టీ లైన్‌లోనే పని చేశా. కానీ, ఇటీవల పార్టీలోకి వచ్చిన ఓ వ్యక్తి సీనియర్లను ఇబ్బందులకు గురిచేస్తూ పార్టీని వీడేలా పనిచేస్తున్నారు అని మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.

మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఇన్ని రోజులు పని చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. బిజెపికి ప్రజలు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. అందరం కలిసి కట్టుగా నియంత పాలన అంతం చేసేందుకు కృషి చేస్తాం అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. 

► కాంగ్రెస్‌కి చెందిన పెద్ద నేత మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరారు. జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో చేరిపోయారు. ఆయన చేరికను స్వాగతిస్తున్నా. మహేశ్వర్ రెడ్డి చేరికతో బీజేపీ మరింత బలోపేతం అవుతుంది అని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ ఛుగ్ చెప్పారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement