ఆర్టీసీకి నష్టం కలిగిస్తోంది కండక్టరా? ప్రయాణికుడా?
తనిఖీల్లో టికెట్ లేని ప్రయాణికులు దొరికినప్పుడు అధికారుల చర్యలు
కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు కోల్పోతున్న కండక్టర్లు
కండక్టరే ఇవ్వలేదంటున్నప్రయాణికులు
ప్రయాణికుడే తీసుకోలేదని కండక్టర్ల వాదన
కండక్టర్ల ఉద్యోగ భద్రతపై కార్మిక సంఘాల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: అతను ఆర్టీసీలో కండక్టర్. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో ప్రయాణికుడి నుంచి డబ్బులు తీసుకుని టికెట్ జారీ చేయలేదు. తనిఖీ సిబ్బంది పట్టుకుని కేసు నమోదు చేశారు. దీంతో విచారణ జరిపిన అధికారులు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఇంకో ఘటనలో హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సును తనిఖీ సిబ్బంది సోదా చేశారు. ఓ ప్రయాణికుడి వద్ద టికెట్ లేదు. తాను డబ్బులిచ్చినా కండక్టర్ టికెట్ ఇవ్వలేదని అతను బుకాయించాడు.
తోటి ప్రయాణికులను విచారించగా, అతను టికెట్ తీసుకోలేదని, కండక్టర్కు డబ్బు ఇచ్చిన విషయం వాస్తవం కాదని తేలింది. దీంతో అతనికి ఫైన్ విధించారు. ఆర్టీసీ బస్సు ప్రయాణాల్లో ఇలాంటివి తరచూ వెలుగు చూస్తున్నాయి. ప్రయాణికుల వద్ద టికెట్ లభించని తరుణంలో విచారణ జరిపితే కొన్ని సందర్భాల్లో కండక్టర్లదే తప్పని, మరికొన్ని సందర్భాల్లో ప్రయాణికులే దోషులని తేలుతోంది. ఆర్టీసీ ఇప్పుడీ అంశం చర్చనీయాంశమయ్యింది. కండక్టర్ల ఉద్యోగ భద్రతపై కార్మీక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈడీల భేటీలో తీవ్ర చర్చ
కొందరు ప్రయాణికులు డబ్బులు మిగుల్చుకునేందుకు టికెట్ తీసుకోవడం లేదని, చెకింగ్ సిబ్బంది వచ్చినప్పుడు కండక్టర్పై నిందమోపుతున్నారని, ఇది కండక్టర్ల ఉద్యోగ భద్రతకు ముప్పుగా పరిణమిస్తోందని కార్మీక సంఘాలు చెబుతున్నాయి. ఆర్టీసీలో కూడా రైల్వే తరహా విధానం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. టికెట్ లేని పక్షంలో ప్రయాణికులనే బాధ్యులను చేయాలనేది వారి వాదన. రెండు రోజుల క్రితం ఈడీల కమిటీతో జరిగిన చర్చలో కూడా ఇది ప్రధాన అంశంగా మారింది. కార్మీకుల సమ్మె డిమాండ్లపై చర్చించి పరిష్కరించే క్రమంలో ప్రభుత్వం ఈడీలతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
కాగా కమిటీ భేటీ మూడున్నర గంటలపాటు జరిగితే, కండక్టర్ ఉద్యోగ భద్రతకు ముప్పుగా మారిన ‘టికెట్’అంశంపైనే గంటపాటు చర్చించడం గమనార్హం. అయితే కమిటీ ఇందుకు వెంటనే ఆమోదం తెలపలేదు. ఇలాంటి ఘటనలపై క్షేత్రస్థాయి సిబ్బంది అనుభవాలు, డిపో మేనేజర్ల దృష్టికి వచ్చిన ఉదంతాలు తదితరాలు పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇందుకోసం క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఉండే మరో కమిటీని నియమిస్తామని పేర్కొనటం విశేషం.
ఎందుకింత ఆందోళన?
గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో అవకతవకలకు కారకులయ్యారనే కారణంతో దాదాపు 1,000 మందికి పైగా ఉద్వాసనకు గురయ్యారు. వీరిలో సగం మంది కండక్టర్లే కావడం గమనార్హం. అయితే తాము చేయని తప్పునకు ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని, ప్రయాణికులు టికెట్ తీసుకోకుండా తమపై నేరం మోపారని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కొందరు కండక్టర్లు ఉద్దేశపూర్వకంగానే టికెట్లు ఇవ్వడం లేదని, దూర ప్రాంత బస్సుల్లో కొన్ని సందర్భాల్లో టికెట్ జారీ చేయకుండా ప్రయాణికుడి నుంచి డబ్బులు తీసు కుని స్వాహా చేస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ విధంగా నేరం గుర్తించిన వారిని మా త్రమే ఉద్యోగాల నుంచి తొలగించామని చెబుతున్నారు. అయితే ఉద్వాసనకు గురైనవారు పలుమా ర్లు ప్రభుత్వానికి విన్నవించుకోవటంతో దాదాపు 300 మందికి తిరిగి ఉద్యోగాలిచ్చారు. ప్రయాణికులకు టికెట్ జారీ చేయాల్సిన బాధ్యత కండక్టర్లదేనని, టికెట్ ఇవ్వని పక్షంలో ప్రయాణికులు డిమాండ్ చేసి మరీ తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో బస్సులో రద్దీ కారణంగా టికెట్ తీసుకోని వారిని గుర్తించే పరిస్థితి ఉండదని కార్మీక సంఘాలు చెబుతున్నాయి.
కండక్టర్లు–ప్రయాణికులు మిలాఖత్!
కొందరు కండక్టర్లు–ప్రయాణికులు మిలాఖత్ అయి టికెట్ జారీ కాకుండా ఆర్టీసీని నష్టపరుస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. టికెట్ చార్జీలో సగం మాత్రమే వసూలు చేస్తున్న కొందరు కండక్టర్లు దాన్ని జేబులో వేసుకుంటున్నారు. తనకు సగం డబ్బులు మిగులుతున్నాయన్న ఉద్దేశంతో ప్రయాణికులు టికెట్ తీసుకోవటం లేదు. తనిఖీ జరిగినప్పుడు ఇది కండక్టర్ ఉద్యోగానికి ముప్పు తెస్తోంది. ఆర్టీసీకి నష్టం జరుగుతోందనేది ఒక అంశం కాగా కార్మిక సంఘాలు కండక్టర్ల ఉద్యోగ భద్రత అన్న కోణంలో ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో దీనిపై కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉంది.


