
విద్యుత్ సంస్థల్లో పనిచేసే దాదాపు 52 వేల మందికి వర్తింపు
రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే కార్యక్రమం: డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు ప్రమాద బీమా కింద రూ. కోటి చెల్లించేలా ఎస్బీఐతో ఒప్పందం చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన సమక్షంలో బ్యాంకర్లతో విద్యుత్ సంస్థలు ప్రమాద బీమా ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 52 వేల మంది ఉద్యోగులకు ఈ ప్రమాద బీమా వర్తించనుంది.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రమాద బీమా కింద ఉద్యోగులు పైసా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.80 లక్షల పరిహారం అందుతుందని తెలిపారు. ఉద్యోగి సహజ మరణం చెందితే రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా ఉంటుందని, ఉద్యోగితోపాటు నలుగురు కుటుంబ సభ్యులకు కలిపి 20 లక్షల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుందని వివరించారు.
త్వరితగతిన ‘యాదాద్రి’ పూర్తికి భట్టి ఆదేశం: యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్ పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. త్వరితగతిన ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టు నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్ను ఆదేశించారు. ప్రతి వారానికి ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనులను సోమవారం పరిశీలించి వచ్చిన బీహెచ్ఈఎల్ సీఎండీ, డైరెక్టర్లు, టీజీ జెన్కో సీఎండీ అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని భట్టికి వివరించారు.
యూనిట్–1, యూనిట్–2 పనులు విజయవంతంగా పూర్తయ్యాయని, మిగతా మూడు యూనిట్ల పనులు తుదిదశలో ఉన్నాయని చెప్పారు. అన్ని యూనిట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా ప్రారంభమవుతాయన్నారు. కాగా ఇటీవల మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్కుమార్లు మంగళవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. ఇద్దరు కొత్త మంత్రులు ఆయన్ను సత్కరించారు.