నరహరిరావు బ్యాంకు లాకర్లు తెరిచిన ఏసీబీ
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడిన తెలంగాణ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ మల్టీ జోన్–2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు ఆస్తులపై ఏసీబీ ఆరా కొనసాగుతోంది. కేసు దర్యాప్తులో భాగంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం కీలక సోదాలు నిర్వహించారు. ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొందిన అనంతరం అధికారులు కెనరా బ్యాంక్ శాలిబండ శాఖలోని నరహరిరావు భార్య పేరుతో ఉన్న రెండు బ్యాంక్ లాకర్లను తెరిచారు. ఈ సోదాల్లో రూ.1.50 కోట్ల నగదు లభ్యమైంది.
అదేవిధంగా ఒక్కోటి 100 గ్రాముల బరువున్న 12 బంగారు బిస్కెట్లు సహా సుమారు 2 కిలోల బరువున్న బంగారం, వజ్రాల ఆభరణాలు కూడా గుర్తించినట్లు ఏసీబీ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, మంగళవారం నరహరిరావు ఇంట్లో ఏసీబీ సోదాల్లో రూ.1.54 కోట్ల నగదు, 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలు లభించాయి. బ్యాంక్ బ్యాలెన్స్ రూ.2.29 కోట్లు, రూ.5.04 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్టు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో ఐదు స్థలాలు, మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పాల్గూడలో 2,500 చదరపు అడుగుల ఫ్లాట్, నార్సింగిలో 1,860 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు ఫ్లాట్లు, రాజేందర్నగర్ సమీపంలో 1,377 చదరపు అడుగుల ఫ్లాట్, గచ్చిబౌ లి టీఎన్జీఓ కాలనీలో జీప్లస్–3 భవంతి, ఛత్రినాకలో జీప్లస్ 2 భవనం ఉన్నట్టు గుర్తించారు. ఈ ఆస్తుల విలువ రూ.13,05,67,100గా ఉన్నట్టు ఏసీబీ అధికారికంగా ప్రకటించింది. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ప్రస్తుతం నరహరిరావు జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్నారని ఏసీబీ అధికారులు వెల్లడించారు.


