ఆన్‌లైన్‌కే సై  | 67 percent of earlybird payments are made online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌కే సై 

May 2 2023 3:28 AM | Updated on May 2 2023 9:31 AM

67 percent of earlybird payments are made online - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సదుపాయాలు కల్పిస్తే ప్రజలు వినియోగించుకుంటారు. తమకు అత్యంత సదుపాయంగా ఉంటే.. ఎవరూ వెళ్లి ఒత్తిడిచేయకున్నా చెల్లింపులు చేస్తారనేందుకు నిదర్శనం జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లు. ఆర్థిక సంవత్సరం మొదటినెలలో ఆస్తిపన్ను చెల్లించేవారికి   ఎర్లీబర్డ్‌ పథకం కింద 5 శాతం రాయితీ ఉంటుంది. ఈ రాయితీని వినియోగించుకోవడం ద్వారా చాలామంది తమ ఆస్తిపన్ను చెల్లించారు. జీహెచ్‌ఎంసీ ఆర్థిక సంవత్సర లక్ష్యమే దాదాపు రూ. 2వేల కోట్లయితే.. ‘ఎర్లీబర్డ్‌’ను వినియోగించుకోవడం ద్వారా ఒక్క నెలలోనే మూడో వంతుకుపైగా ఆదాయం సమకూరింది. 

ఎక్కువ మంది ఆన్‌లైన్‌ ద్వారా 
ఎర్లీబర్డ్‌ను వినియోగించుకున్న ఇళ్ల యజమానులు 7.35 లక్షల మంంది కాగా, వారిలో 4.95 లక్షల మంది ఆన్‌లైన్‌ ద్వారానే ఆస్తిపన్ను చెల్లించారు. అంటే దాదాపు 67 శాతం మంది ఆన్‌లైన్‌ను వినియోగించుకున్నారు. వీరి చెల్లింపుల ద్వారా జీహెచ్‌ఎంసీ ఖజానాకు రూ.786.75 కోట్ల ఆదాయం సమకూరింది.
 
ఆదాయం పెరుగుతున్నా.. 
జీహెచ్‌ఎంసీ ఖజానాకు ఆస్తిపన్ను వసూళ్ల ద్వారా ఏటికేడాది ఆదాయం పెరుగుతున్నప్పటికీ, అంతకుమించి పెరుగుతున్న ఖర్చులతో  ఇబ్బందులు తప్పడం లేదు. వేల కోట్లు ఖర్చయ్యే భారీ ప్రాజెక్టులకు సైతం జీహెచ్‌ఎంసీ నుంచే ఖర్చు చేస్తుండటం ఇందుకు ప్రధాన కారణం కాగా, అధికారులు, పాలకమండలి మితిమీరిన ఖర్చులు కూడా ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆనందించేలోగా.. అదనపు భారం 
ఎర్లీబర్డ్‌ ద్వారా టార్గెట్‌ను మించి ఆదాయం రావడంతో సంతోషపడిన అధికారుల ఆనందం అంతలోనే ఆవిరైంది. పారిశుద్ధ్య కార్మి కుల వేతనాలను అదనంగా రూ.1000 పెంచుతూ జీఓ జారీ చేసిన ప్రభుత్వం.. ఈమేరకు అదనపు వ్యయాన్ని జీహెచ్‌ఎంసీ ఖజానా నుంచే చెల్లించాలని పేర్కొనడమే ఇందుకు కారణం. దీంతో జీహెచ్‌ఎంసీ ఖజనాకు సంవత్సరానికి దాదాపు రూ.30 కోట్ల అదనపు భారం పడనుంది.  

Advertisement
 
Advertisement
Advertisement