473 Cr Deposit in Telangana Farmer Bank Account | Yadadri District News in Telugu - Sakshi
Sakshi News home page

రాత్రికి రాత్రే రైతు ఖాతాలో రూ.473 కోట్లు

Dec 11 2020 8:37 AM | Updated on Dec 11 2020 1:00 PM

473 Crore Rupees Added In A Farmer Account In Yadadri District - Sakshi

నల్లగొండ/యాదాద్రి/తుర్కపల్లి: ఓ సామాన్య రైతు ఖాతాలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.473 కోట్ల మేర నగదు జమైంది. అంత డబ్బు తన ఖాతాలో చూసిన ఆ రైతు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన అనుమూల సంజీవరెడ్డి అనే రైతుకు భువనగిరిలోని డక్కన్‌ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. సంజీవరెడ్డి బుధవారం పక్కనున్న సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌కు వెళ్లాడు. డబ్బులు అవసరం ఉండగా ఏటీఎం కార్డు ద్వారా డీసీసీబీ ఏటీఎం సెంటర్‌లో డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బులు రాకపోవడంతో బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకున్నాడు. అంతే తన ఖాతాలోని బ్యాలెన్స్‌ చూసి ఆశ్చర్యపోయాడు. ఖాతాలో రూ.473,13,30,000 అని ఉంది. ఇన్ని డబ్బులు తన ఖాతాలో ఎందుకు ఉన్నాయో అతనికి అర్థం కాలేదు. ఆ ఏటీఎంలో తప్పుడు రిసిప్ట్‌ ఏమైనా వచ్చిందేమోనని ఎస్‌బీఐ ఏటీఎంలో కూడా చెక్‌ చేశాడు. అక్కడా అంతే బ్యాలెన్స్‌ చూపించింది. (చదవండి: నోట్లోంచి డబ్బులు రప్పిస్తానని.. )

అయితే తన ఖాతాలో అన్ని డబ్బులు ఉన్నా.. ఏటీఎం నుంచి డబ్బులు ఎందుకు రావడం లేదో తెలుసుకునేందుకు గురువారం భువనగిరిలోని డక్కన్‌ గ్రామీణ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు అధికారులకు విషయం తెలపగా వారు చెక్‌ చేసి ‘మీ అకౌంట్‌ ఫ్రీజ్‌ అయ్యింది.. ఏటీఎం సర్వర్‌ పనిచేయడం లేదు’.. అని సమాధానం ఇచ్చారు. ఏటీఎం రిసిప్ట్‌లో భారీ మొత్తంలో బ్యాలెన్స్‌ చూపిస్తోందని చెప్పగా.. ‘మీ ఖాతాలో కేవలం రూ.4వేల చిల్లర మాత్రమే ఉందని’సమాధానం ఇచ్చారు. దీంతో సంజీవరెడ్డి ఏమీ అర్థంకాక వెనుదిరిగి ఇంటికి చేరుకున్నాడు. కాగా, అతని ఖాతాలో కోట్ల కొద్ది డబ్బు జమైందన్న విషయం రెండు రోజులుగా మండలంలో చర్చనీయాంశమైంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement