పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలని.. మార్కెట్ నుంచి తీసుకురాగానే ఫ్రిజ్లో పెట్టేస్తుంటాం. కానీ అలా చేయడం వల్ల కొన్ని రకాల ఫ్రూట్స్ రుచి మారడమే కాకుండా, వాటిలోని పోషక విలువలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. అలా ఫ్రిజ్లో నిల్వ ఉంచకూడనివి...
అరటిపండ్లను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితేనే అవి సహజంగా మగ్గుతాయి. వీటిని ఫ్రిజ్లో పెట్టడం వల్ల పండ్ల తొక్కలు త్వరగా నల్లగా మారిపోతాయి. పండు లోపల గట్టిగా, చప్పగా తయారవుతుంది.
పుచ్చకాయలను ఫ్రిజ్లో ఉంచితే వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గణనీయంగా తగ్గిపోతాయి. అయితే, పండును ముక్కలుగా కోసిన తర్వాత మాత్రం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిజ్లో దాచుకోవచ్చు.
ఆవకాడోలు పూర్తిగా పక్వానికి రావడానికి వేడి వాతావరణం అవసరం. వీటిని పచ్చిగా ఉన్నప్పుడే ఫ్రిజ్లో పెడితే, అవి పక్వానికి రాకుండా గట్టిగానే ఉండిపోతాయి.
మామిడిపండ్లు పచ్చిగా ఉన్నప్పుడు ఫ్రిజ్లో పెట్టకూడదు. చల్లదనం వల్ల ఇవి మగ్గే ప్రక్రియ నెమ్మదించడమే కాకుండా, వీటి తీపిదనం తగ్గిపోతుంది.
బొప్పాయి పండును ఫ్రిజ్లో పెట్టడం వల్ల రుచి మారిపోతుంది. ఫ్రిజ్ ఉష్ణోగ్రత బొప్పాయి త్వరగా కుళ్ళిపోయేలా లేదా లోపల గట్టిగా ఉండేలా చేస్తుంది.
నేరేడు, రేగు, సపోటా వంటి పండ్లను ఫ్రిజ్లో పెట్టడం వల్ల అవి జ్యూసీగా మారకుండా లోపల ఎండిపోయినట్లు డ్రైగా తయారవుతాయి.


