వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్ ను రెచ్చగొడుతున్నారు. విదేశాల్లో ఫ్రీజైన ఇరాన్ ఆస్తులను గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి సాయంగా అందించే యోచన చేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే అసలే అమెరికా ఆంక్షలతో మండిపడుతున్న ఇరాన్ ఈ వ్యవహారంతో చర్చలకు పూర్తిగా ఫులిస్టాప్ పెట్టే అవకాశం ఉంది.
పశ్చిమాసియా యుద్ధం తాలూకా విధ్వంసం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్ ప్రతీకారంతో హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో చమురు సంక్షోభం తలెత్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కారణంతో ప్రపంచ దేశాలు ట్రంప్పై మండిపడ్డాయి. పరిస్థితి తీవ్ర స్థాయికి చేరడంతో అమెరికా కొంత తగ్గి ఇరాన్తో చర్చల ఒప్పందం కోసం యత్నించింది. అయితే అమెరికా షరతులకు ఇరాన్ ససేమిరా అనడంతో రాజీ కుదరలేదు. అయితే ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం పాటించడంతో పరిస్థితులు కొంతమేర ప్రశాంతంగా ఉన్నాయి. ఇదంతా తెలిసిన కథే
అయితే మరోసారి అమెరికా ఇరాన్ను రెచ్చగొట్టే యత్నం చేస్తుంది. ఇరాన్ డిమాండ్లలో ప్రధానమైనవి ఫ్రీజ్ చేసిన తమ దేశ ఆస్తులను వెంటనే విడుదల చేసి యుద్ధ నష్టానికి తగిన పరిహారం అందించడం. అయితే అమెరికా మాత్రం ప్రస్తుతం ఆ డబ్బులను గల్ఫ్ దేశాల్లో జరిగిన నష్టానికి పరిహారంగా అందించే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాపై ప్రతీకారంతో ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడి చేయడంతో అక్కడి మౌళిక స్థావరాలు చాలా వరకూ దెబ్బతిన్నాయి. దీంతో ఆదేశాలు ట్రంప్పై గుర్రుగా ఉన్నాయి. దీంతో వాటిని శాంతపరిచేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ ఆస్తులు విదేశాల్లో ఎందుకు ?
ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు,సహజ వాయువు ఉత్పత్ చేసే దేశాలలో ఒకటి. అది ఇతర దేశాలకు చమురును విక్రయించినప్పుడు, ఆయా దేశాలు ఇరాన్కు చెల్లించాల్సిన కోట్లాది డాలర్ల డబ్బు అంతర్జాతీయ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. దీంతో అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ సొమ్మును అమెరికా లీగల్గా బ్లాక్ చేసింది. ఇవే కాకుండా ఆంక్షలు రాకముందు విదేశాలలో ఇరాన్ ప్రభుత్వం కొనుగోలు చేసిన భవనాలు, భూములు లేదా ఇతర కంపెనీలలో పెట్టిన పెట్టుబడులు.బంగారు నిల్వలను సైతం అమెరికా బ్లాక్ చేసింది.
ఎంత డబ్బు ఫ్రీజ్ అయ్యింది.?
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 బిలియన్ డాలర్ల నుండి 123 బిలియన్ డాలర్లు సుమారుగా రూ. 8.3 లక్షల కోట్ల నుండి రూ. 10.2 లక్షల కోట్ల డబ్బు ఫ్రీజైనట్లు విశ్లేషకుల అంచనా అయితే, ఇందులో నేరుగా అమెరికా నియంత్రణలో నేరుగా అమెరికా నియంత్రణలో దాదాపు 24 బిలియన్ డాలర్లు ఉంది. ఆడబ్బుని వెంటనే చెల్చించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.
మిగతా కరెన్సీ దక్షిణ కొరియా, జపాన్, యూరప్, మరియు కొన్ని గల్ఫ్ దేశాల బ్యాంకుల్లో ఉన్నాయి. ఇరాన్ ఆయా దేశాలకు చమురు అమ్మగా వచ్చిన డబ్బు అది. కానీ అమెరికా విధించిన బ్యాంకింగ్ ఆంక్షల భయం వల్ల ఆ దేశాలు ఇరాన్కు ఆ డబ్బు ఇవ్వకుండా తమ వద్దే నిలిపివేశాయి. అయితే ప్రస్తుతం ఆ డబ్బులను గల్ఫ్ దేశాల పునర్నర్మాణం కోసం వాడాలని అమెరికా భావిస్తోంది. ఇదే జరిగితే ఇక యుద్ధం తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉంది.


