పదో వసంతంలోకి తెలంగాణ | Telangana State Formation day Decade celebrations from June 2 | Sakshi
Sakshi News home page

పదో వసంతంలోకి తెలంగాణ

Jun 2 2023 2:45 AM | Updated on Jun 2 2023 9:21 AM

Telangana State Formation day Decade celebrations from June 2 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రం పదో వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా జూన్‌ 2 నుంచి మూడు వారాల పాటు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

అన్ని శాఖల పరిధిలోని విభాగాధిపతుల కార్యాలయాల్లో ఉదయం 7.30గంటలకే జాతీయ జెండా ఆవిష్కరించాలని.. తర్వాత సచివాలయంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలని హెచ్‌ఓడీల అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది. సచివాలయానికి హెచ్‌ఓడీల కార్యాలయాల నుంచి ఉద్యోగులను తరలించడానికి ప్రత్యేకంగా 278 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.

వివిధ హెచ్‌వోడీల్లో పనిచేస్తున్న దాదాపు 13,510 మంది అధికారులు, ఉద్యోగులను ఈ వేడుకలలో పాల్గొనడానికి ఆహ్వానించారు. శాఖలు, విభాగాల వారీగా ఉద్యోగులను తీసుకుని వచ్చే బస్సుల కోసం పార్కింగ్‌ స్థలంతోపాటు, వేడుకల్లో పాల్గొనే ఉద్యోగులు లాన్‌లో ఎక్కడెక్కడ ఆసీనులు కావాలో తెలియచేస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హెచ్‌ఓడీల ఉద్యోగుల్లో కనీసం 60శాతం మంది సచివాలయంలో జరిగే వేడుకల్లో పాల్గొనాలని ఆదేశాలు వెళ్లాయి. 

రోజుకో కార్యక్రమంతో.. 
ఇక దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గత తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిపై విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో రోజు ఒక్కో రంగం చొప్పున 21 రోజుల పాటు ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 

జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో.. 
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల మంత్రులు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు శుక్రవారం జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభిస్తారు. నియోజకవర్గ, మండల స్థాయిల్లో సైతం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement