Telangana Minister Harish Rao Interacting With Matindla Villager - Sakshi
Sakshi News home page

నీకు వందకు వంద మార్కులు సార్‌..

Published Fri, Jun 2 2023 9:39 AM

Matindla Villager With Minister Harish Rao - Sakshi

సిద్దిపేట రూరల్‌/సిద్దిపేట: నారాయణరావుపేట మండలం మాటిండ్ల గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు మధ్యాహ్నం సమయంలో స్థానికులతో కలిసి భోజనం చేశారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కిషన్‌తో కొద్దిసేపు మాట్లాడారు.  మంత్రి హరీశ్‌రావు: కిషన్‌ అన్న.. అభివృద్ధి అనే పరీక్ష రాసిన. ఎన్ని మార్కులు ఏస్తవ్‌.. ఇంకా ఊరిలో ఏమైనా నేను చేసే పనులు ఉన్నాయా?  

కిషన్‌: ఏం లేవు సార్‌.. అన్ని పనులు అయ్యాయి 
మంత్రి: నా అభివృద్ధి పనికి ఎన్ని మార్కులు ఏస్తవ్‌?  

కిషన్‌: నీకు వందకు వంద మార్కులు ఏస్తం సార్‌..  
మంత్రి: మాటిండ్లలో నాకు ఎంతమంది వంద మార్కులు ఏస్తరంటవు 

కిషన్‌: మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చేశారు. ఎవరికి ఓటు పోదు. మొత్తం ఓట్లు మీకే సార్‌. అన్ని పనులు చేశావ్‌. చేసేవి ఏమీ లేవు.. అంటూ అన్నం ముద్ద నోట్లో పెడుతూ నవ్వుతూ మంత్రికి చెప్పారు. 

యూపీలో ఆయిల్‌ ఇంజన్‌ సర్కారే 
ఉత్తరప్రదేశ్‌లో ఉన్నది డబుల్‌ ఇంజన్‌ సర్కా రు కాదు.. ఆయిల్‌ ఇంజన్‌ సర్కారని.. ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఆయన గురువారం సిద్దిపేట, నారాయణరావుపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 15లోపు సిద్దిపేటకు రైలు ట్రయల్‌ రన్‌ ఉంటుందని తెలిపారు. సిద్దిపేట–సిరిసిల్ల రైల్వే లైన్‌ నిర్మాణ పనులకు రూ.500 కోట్లు కేటాయించామని, టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని మంత్రి హరీశ్‌ వెల్లడించారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement