సాక్షి, చైన్నె: తమిళనాట ఉప ఎన్నికల నగారా మోగింది. మదురాంతకం, తారాపురం అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 6న ఉపఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ సోమవారం సాయంత్రం ప్రకటించింది. మిగిలిన 5 స్థానాలను పెండింగ్లో పెట్టారు. అలాగే, పుదుచ్చేరిలోని తట్టాంచావడి నియోజకవర్గానికి సైతం ఉప ఎన్నిక జరగనుంది.
ఉపఎన్నికల షెడ్యూల్ వివరాలు
ఎన్నికల ప్రక్రియ ,నామినేషన్ల పర్వం ఈనెల 9వ తేది నుంచి ప్రారంభం కానున్నది. ఈనెల 16వ తేదీ నామినేషన్ల సమర్పణకు చివరి రోజు ,17వ తేదీన పరిశీలన, 19వ తేదిన ఉపసంహరన ప్రక్రియలు జరగనున్నాయి. అక్టోబరు 6న ఉప ఎన్నికల, 9వ తేదీన ఫలితాల లెక్కింపు జరగనున్నాయి.
రెండు స్థానాలకే..
రాష్ట్రంలో 7 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఒకటి సీఎం విజయ్ తిరుచ్చి తూర్పు నియోజకవర్గం పదవికి రాజీనామా చేయడం జరిగింది. మరో ఆరు నియోజకవర్గాలు అన్నాడీఎంకే నుంచి రాజీనామా చేసి టీవీకేలో చేరిన వారు ఉన్నారు. వీరిలో మదురాంతకం –మరగదం కుమర వేల్, తారాపురం – సత్యభామా, పెరుంతురై – జయకుమార్, అంబా సముద్రం – ఇసక్కి సుబ్బయ్య, విరాళి మలై – విజయ భాస్కర్, కరూర్ – ఎం ఆర్విజయ భాస్కర్ ఉన్నారు. తాజాగా 2 స్థానాలకే ఉప ఎన్నికలను ప్రకటించారు. వీటిలో మదురాంతకం, తారాపురంలు ఉన్నాయి. మిగిలిన తిరుచ్చి తూర్పుతో సహా మిగిలిన ఐదు స్థానాల అభ్యర్థుల గెలుపునకు వ్యతిరేకంగా కోర్టులలో పిటిషన్లు దాఖలై ఉన్నాయి. ఈ కేసులు తేలే వరకు ఉప ఎన్నికలు నిర్వహించబోమని ఇప్పటికే కోర్టుకు ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడం గమనార్హం. తాజాగా మోగిన ఉప ఎన్నికల నగారా నేపథ్యంలో మధురాంతకం, తారాపురం రెండు నియోజకవర్గాల పరిధిలో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.


