సాక్షి, చైన్నె: పురాతన తమిళుల నాగరికత ప్రాచీనతను వెలికితీసేందుకు మైలాడుతురై జిల్లా పూంబుహార్లోని లోతైన సముద్ర తీరంలో 3వ విడత పరిశోధన పనులు మొదలయ్యాయి. ఈ పనులను పాఠశాల విద్య, పురావస్తు శాఖ మంత్రి రాజ్మోహన్ ప్రారంభించారు. స్కూబా డైవ్తో ఆయన సైతం సముద్రంలోకి దిగారు. తమిళనాడు పురావస్తు శాఖ, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ సహాయంతో 2025 , 2026 మార్చి నెలల్లో నిర్వహించిన మొదటి రెండు విడతల తవ్వకాలలో మునిగిపోయిన భవనాలు, ప్రహరీ గోడలు, రహదారులు, కుండ పెంకులు, ఇటుకలతో పాటు 17వ శతాబ్దానికి చెందిన ఒక ఓడను గుర్తించారు. ఈక్రమంలో పూంబుహార్ తీరం నుండి 6 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 3వ విడత పరిశోధనలు ప్రారంభమయ్యాయి. మంత్రి రాజ్మోహన్, పురావస్తు శాఖ డైరెక్టర్ జయశీలన్ స్వయంగా స్కూబా డైవింగ్ పరికరాలతో సముద్రంలోకి దిగి పనులను పరిశీలించారు. పురా వస్తు సలహాదారు ప్రొఫెసర్ రాజన్ నేతృత్వంలో జాయింట్ డైరెక్టర్ యతీష్ కుమార్, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ శివానందం, స్కూబా డైవర్లతో కూడిన 25 మంది నిపుణుల బృందం అత్యాధునిక కెమెరాలు, డైవింగ్ పరికరాలతో బోట్లలో సముద్రంలోకి వెళ్లి పరిశోధనలు నిర్వహించింది. సముద్రం అడుగున నిర్మాణాలు, నివాస గోడలు, చేద బావులు లభించాయి. తమిళులు వాడిన కుండ పెంకులతో పాటు విదేశీ కుండ పెంకులు కూడా లభ్యమవ్వడంతో పూంబుహార్ ప్రాచీన కాలంలో గొప్ప వాణిజ్య, సాంస్కృతితిక కేంద్రంగా వెలిగిందని స్పష్టమవుతోందని ఈసందర్భంగా మంత్రిరాజ్మోహన్ వివరించారు.
చారిత్రక ప్రాధాన్యత
సింధు లోయ నాగరికత వదిలిన ప్రదేశం, సంగం సాహిత్యం పేర్కొన్న ప్రదేశం ఒకటేనని నిరూపించేందుకు అతి సమీపంలో ఉన్నామన్నారు. ప్రపంచానికి నాగరికతను నేర్పినవారు తమిళులేననే వాస్తవాలు త్వరలోనే బయటపడుతాయన్నారు.


