సాక్షి, చైన్నె : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చైన్నెలో వైఎస్సార్ సేవాదళ్ నేతృత్వంలో శనివారం పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు జరిగాయి. పెరంబూరులోని సోమ సుందరం నగర్లో జాతీయ జెండాను ఎగుర వేశారు. పిల్లలకు, స్వీట్లు చాక్లెట్లు , పుస్తకాలు, బ్యాగ్లు, వాటర్ బాటిళ్లు తదితర వస్వులును అందజేశారు. అలాగే, పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ఆర్ సేవాదళ్ తమిళనాడు అధ్యక్షుడు ఏకే జహీర్ హుస్సేన్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో సోమ సుందరం నగర్ గ్రామ పెద్ద తిరువెంగడం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పిల్లలు జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి దేశ భక్తి భావాన్ని చాటే విధంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాలలో పెద్ద వైఎస్సార్ సీపీ అభిమానులు , సేవాదళ్ వర్గాలు శరవణన్, కార్తీక్, మాల్యాద్రి, విజయన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ’వి ది లీడర్స్’ భారీ ర్యాలీ
సాక్షి, చైన్నె: బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వి ది లీడర్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు కె. అన్నామలై నాయకత్వంలో ఆదివారం చైన్నెలో భారీ పర్యావరణ అవగాహన ర్యాలీ జరగనుంది. ప్రజా సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటూ ప్రజా మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా ’వి ది లీడర్స్’ మూవ్మెంట్ ద్వారా అన్నామలై వరుస కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే చైన్నె ఎగ్మోర్లోని రాజరత్నం స్టేడియం సమీపంలో ఆదివారం సాయంత్రం 3 గంటలకు పర్యావరణ రక్షణపై ప్రత్యేక ర్యాలీని తలపెట్టారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి ఉన్న యువత, పౌరులు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరై ర్యాలీని జయప్రదం చేయాలని అన్నామలై పిలుపునిచ్చారు.
విద్యార్థి మృతితో కలకలం
అన్నానగర్: చైన్నెలోని తిరువొత్తియూర్ విమ్కో నగర్లో జై గోపాల్ కరోడియా ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక పాఠశాల ఉంది. ఇక్కడ బాలురు, బాలికలు కలిపి 1800 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. తిరువొత్తియూర్ లోని తంగల్ వసంత నగర్ ప్రాంతానికి చెందిన వెంకటేష్ కుమారుడు ధనుష్ (16), ఈ పాఠశాలలో ప్లస్ –2 హిస్టరీ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో, శుక్రవారం సాయంత్రం సుమారు 4.30 గంటలకు, పాఠశాల సమీపంలోని అజాక్స్ స్టేషన్ వెనుక ఖాళీ స్థలంలో ఒక విద్యార్థి మతదేహం పడి ఉందని లయన్స్ మహిళ పోలీసులకు సమాచారం అందింది. వారు వెంటనే తిరువొత్తియూర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరపగా, హత్యకు గురైన వ్యక్తి విద్యార్థి ధనుష్ అని తేలింది. అనంతరం పోలీసులు ధనుష్ మతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టం కోసం 108 అంబులెన్స్లో స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు.డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ భాస్కరన్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పాల్ రాజా, ఇన్స్పెక్టర్ అలెక్స్, పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా 12 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిసింది.
చైన్నె పోర్ట్ అథారిటీకి రూ. 1,185 కోట్ల రికార్డు రాబడి
సాక్షి,చైన్నె : చైన్నె పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాయపేటలోని బాబు జగజీవన్ రామ్ స్పోర్ట్స్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైన్నె పోర్ట్ అథారిటీ చైర్మన్ సచిన్ ఎస్. కుర్వే జాతీయ జెండాను ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంలో చైన్నె పోర్ట్ రికార్డు స్థాయిలో రూ. 1,185 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని, గత ఏడాదితో పోలిస్తే 5.4 శాతం వృద్ధి సాధించిందని చైర్మన్ తెలిపారు.
గత 22 ఏళ్లలో ఇదే..
గత ఆర్థిక సంవత్సరంలో పోర్ట్ ద్వారా మొత్తం 58 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరిగిందన్నారు.రూ. 17,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఔటర్ పోర్ట్ ప్రాజెక్ట్ పూర్తయితే, ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌకలకు చైన్నె పోర్ట్ ఒక అంతర్జాతీయ కంటైనర్ హబ్గా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.గ్రీన్ పోర్ట్ చొరవలో భాగంగా పోర్ట్ ప్రాంగణంలో సుమారు 13,760 మొక్కలు నాటడం వల్ల పచ్చదనం 12 శాతానికిపెరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అనుగ్రహ, కార్యదర్శి తారా సుకీర్త, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ కిరు కృపానంద స్వామి, ఫైనాన్షియల్ కంట్రోలర్ మళ్ల శ్రీనివాసరావు, చీఫ్ ఇంజినీర్ రవికుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


