తమిళసినిమా: మంచి కంటెంట్తో కూడిన కథా చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అలాంటిది మైత్రీ మూవీ మేకర్స్ వంటి సంచలన విజయాలకు చిరునామాగా మారిన సంస్థ నుంచి వస్తున్న చిత్రం అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.ఈ సంస్థ భారీ చిత్రాలతో పాటు మంచి కంటెంట్తో కూడిన చిన్న చిత్రాలను నిర్మిస్తూ సక్సెస్ ను అందుకుంటోంది. ఈ సంస్థ ద్వారా తమిళంలో వచ్చిన పుష్ప 2, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలు సంచలన విజయం సాధించాయి. తాజాగా నిర్మించిన చిత్రం మొద రాతిరి. రిషీకాంత్, అనిష్మా అనిల్ కుమార్ జంటగా నటించిన ఈ చిత్రానికి రాజా కరుప్పుసామి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మొద రాతిరి చిత్రం ఈ నెల 21వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ఆవిష్కరణను గురువారం మధ్యాహ్నం స్ధానిక వడపళనిలోని ఒక కల్యాణ మండపంలో నిర్వహించారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ మాట్లాడుతూ దర్శకుడు రాజా కరుప్పుసామి కథ చెప్పగానే తమకు నచ్చేసిందన్నారు. ఇటీవల టూరిస్ట్ ఫ్యామిలీ వంటి చిన్న బడ్జెట్ తో రూపొందిన మంచి కథా చిత్రాలు విజయవంతమయ్యాయని చెప్పారు.అదే విధంగా మొద రాతిరి చిత్రం కూడా మంచి కథాంశంతో రూపొందిందని రవి శంకర్ వెల్లడించారు. ఈ చిత్రంలో కథానాయికిగా తనను ఎంపిక చేసినందుకు దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అనీ, ఇందులో తాను ముత్తు లక్ష్మి అనే పాత్రలో నటించినట్లు నటి అనిష్మా అన్నారు. తన కథలోని ఆత్మను నమ్మి అవకాశం కల్పించిన నిర్మాతలకు కృతజ్ఞతలని దర్శకుడు రాజా కరుప్పుసామి తెలిపారు.ఇప్పుడం సినిమాను కాపాడేది చిన్న బడ్జెట్ కథా చిత్రాలే అనేది తను భావన అన్నారు. తన అనుభవంతో రూపొందిన కథా చిత్రం ఇదని చెప్పారు. షార్ట్ ఫిల్మ్గా రాజా తయారు చేసిన ఈ చిత్ర కథను ఆరేళ్ల పయనంతో చిత్రంగా రూపొందించామని కథానాయకుడు రిషీకాంత్ వివరించారు.


