సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటమి అనంతరం ప్రతిపక్షం అన్నాడీఎంకే లోఅంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు విడివిడిగా సమావేశాలు జరుపుతుండటం రాజకీయంగా చర్చ ఊపందుకుంది. పార్టీ నిబంధనలను ఉల్లంఘించారనే నెపంతో మాజీ మంత్రి సి.వి. షణ్ముగం నుండి జిల్లా కార్యదర్శి పదవిని పళనిస్వామి లాక్కున్నారు. ఆయన స్థానంలో పశుపతి అనే నేతను నియమించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది.
శశికళ చేరికపై పట్టు
పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా మాజీ నాయకురాలు శశికళ, టీటీవీ దినకరన్ మరియు గతంలో తొలగించబడిన కార్యవర్గ సభ్యులందరినీ తిరిగి పార్టీలోకి తీసుకోవాలని సీనియర్ నేత ఎస్.పి. వేలుమణి గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే దీనిపై పళనిస్వామి విముఖత చూపుతున్నారు.
ఇటీవలే ఆరుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి అధికారటీవీకే పార్టీలో చేరగా, మిగిలిన అసమ్మతి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఒక ప్రత్యేకబృందంగా వ్యవహరించాలని యోచిస్తున్నట్లు సమాచారాలు వెలువడ్డాయి. గత కొన్ని రోజులుగా సి.వి. షణ్ముగం, ఎస్.పి. వేలుమణి నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం సచివాలయంలో మంత్రులను కలవడం పలు ఊహాగానాలకు దారితీసింది. రాబోయే ఉప ఎన్నికల తరుణంలో ఈ అంతర్గత కలహాలు పార్టీ విజయానికి పెద్ద ఆటంకంగా మారుతాయని అన్నాడీఎంకే అగ్ర నాయకత్వం ఆందోళన చెందుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం సీవీ షణ్ముగం నివాసంలో అసమ్మతి ఎమ్మెల్యేలు సమావేశం కావడం ప్రాధాన్యతకు దారి తీసినట్లయ్యింది. వీరంతా సోమవారం నుంచి అసెంబ్లీకి పళణిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో కలిసి కాకుండా, తాము ప్రత్యేక బృందంగా వెళ్లడానికి వ్యూహ రచన చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి.
అసెంబ్లీలో ప్రత్యేక బృందంగా వెళ్లే యోచన?


