తిరువళ్లూరు: ఊత్తుకోట సమీపంలోని అంజాత్తమ్మన్ ఆలయంలో చోరి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్ పెద్దపాళ్యం సమీంపలో అంజాత్తమ్మన్ ఆలయం ఉంది. ఆలయానికి ఆషాడమాసం భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆలయంలో ప్రత్యేక అభిషేకంతో పాటు ఉత్సవాలను నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయంలో బుధవారం రాత్రి యధావిదిగా పూజలు నిర్వహించిన తరువాత అర్చకుడు తాళం వేసుకుని ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అనంతరం గురువారం ఉదయం పూజలు చేయడానికి ఆలయానికి రావడంతో అప్పటికే తాళం, హుండి పగలగొట్టి వుండడాన్ని చూసి షాక్కు గురైయ్యాడు. వెంటనే విషయాన్ని పెద్దపాళ్యం పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు హుండీలోని నగదు, అమ్మవారి ఆభరణాలు చోరికి గురైనట్టు నిర్దారించి అక్కడ వేలిముద్రలను సేకరించారు. ఆలయ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


