సాక్షి, చైన్నె: ‘‘ఎన్నికల్లో గెలిస్తే ఎడప్పాడి పళనిసామి కారణం, ఓడిపోతే మాత్రం జిల్లా కార్యదర్శులు కారణమా? అని ఆ పార్టీ సీనియర్ నేత సీ వీ షణ్ముగం అధిష్టానాన్ని ప్రశ్నించారు. సరైన పొత్తులు కుదుర్చుకోకపోవడం, విడిపోయిన నాయకులను మళ్లీ కలిపి తీసుకెళ్లకపోవడమే నామమాత్రపు ఫలితాలకు, అన్నాడీఎంకే ఓటమికి ప్రధాన కారణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ నాయకత్వం , పళణి స్వామి తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పళనిసామి వచ్చాక ఒక్క గెలుపూ లేదు:
బలమైన నాయకుడు కావాలని ఎడప్పాడి పళని స్వామిని ఎన్నుకున్నాం. కానీ ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అన్నాడీఎంకే ఒక్క ఎన్నికలోనూ విజయం సాధించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలైనా... అన్నింటిలోనూ ఓటమే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా చైన్నెలో అన్నాడీఎంకే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు.
ఓటమికి బాధ్యత వహించాలి..
కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ వంటి నేతలు రాజీనామాలు చేశారని గుర్తుచేస్తూ, తాము పళణి స్వామిని రాజీనామా చేయమని అడగడం లేదని, కానీ ఓటమిపై సమీక్షించేందుకు వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణాది జిల్లాలు, డెల్టా, చైన్నెలలో అన్నాడీఎంకే దారుణంగా దెబ్బతిన్నదని, కేవలం ఉత్తర జిల్లాల్లో పిఎంకే మద్దతు ఇవ్వడం వల్లే అక్కడ కొన్ని స్థానాలు గెలవగలిగామని తెలిపారు. ఇపిఎస్ సొంత ప్రభావంతోనే 47 స్థానాలు గెలిచామని అగ్రి కష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ... ‘అంటే మిగతా నియోజకవర్గాల్లో ఆయనకు ప్రభావం లేదని ఒప్పుకుంటున్నారా? సొంత జిల్లా సేలంలోని 7 నియోజకవర్గాల్లో ఎందుకు గెలవలేకపోయారు? అని ప్రశ్నించారు.కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓటమిపై చర్చించే ధైర్యం ఉందా అని సవాల్ విసిరిన షణ్ముగం, అగ్రి కృష్ణమూర్తికి తమకు పాఠాలు చెప్పే అర్హత లేదన్నారు. జయలలిత హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి జైలుకు వెళ్లిన వ్యక్తి అగ్రి కృష్ణమూర్తి అని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు.


