సాక్షి, చైన్నె: తమిళనాడులోని ప్రముఖ నగరాలైన కోయంబత్తూర్, మధురైలలో మెట్రో రైలు ప్రాజెక్టులను త్వరగా చేపట్టాలని డీఎండీకే కోశాధికారి, రాజ్యసభ సభ్యుడు ఎల్.కే. సుదీష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను ఢిల్లీలో నేరుగా కలసి వినతిపత్రం అందజేశారు.
ప్రాధాన్యత క్రమంలో పరిశీలించాలి..
కోయంబత్తూర్, మధురై నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల ఆమోదం, నిధుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి వేగంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ సుదీష్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వ్యాపార రంగానికి ప్రధాన కేంద్రంగా ఉన్న కోయంబత్తూర్లో మెట్రో ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే పారిశ్రామిక ప్రగతి మరింత వేగవంతమవుతుందని తెలిపారు. దక్షిణ తమిళనాడులో కీలక పర్యాటక, అభివద్ధి కేంద్రమైన మధురైలో మెట్రో వ్యవస్థ పట్టణ రవాణాను ఎంతో సులభతరం చేస్తుందని పేర్కొన్నారు.ఈ రెండు నగరాల్లో మెట్రో రైలు అందుబాటులోకి రావడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా, ప్రజల ప్రయాణ సమయం కూడా గణనీయంగా ఆదా అవుతుందని ఆయన వివరించారు.
రాష్ట్ర అభివృద్ధికి పార్లమెంట్లో గళమెత్తుతాం..
ఈ సందర్భంగా ఎంపీ ఎల్.కే. సుదీష్ మాట్లాడు తమిళనాడు ప్రజల ప్రాథమిక అవసరాలు, నగర మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద నిరంతరం ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజ్యసభలోనే కాదు, కేంద్ర మంత్రుల వద్ద కూడా నిరంతరం గళం విప్పుతూనే ఉంటామని స్పష్టం చేశారు.


