త్వరలోనే అధికారిక ప్రకటన
సాక్షి, చైన్నె : సీఎం విజయ్ కర్ణాటక పర్యటనపై వ్యవసాయ మంత్రి వినోద్ మాట మార్చేశారు. త్వరలో సీఎం విజయ్ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని దాట వేశారు. కాగా కావేరి వివాదం నేపథ్యంలో తమిళనాడు– కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉత్కంఠ పెరుగుతున్నది. సరిహద్దులలో నిఘాను రెండు రాష్ట్రాల పోలీసులు పెంచేశారు. వివరాలు.. తమిళనాడు – కర్ణాటక మధ్య కావేరి జల వివాదం గురించి తెలిసిందే. తాజాగా తమిళనాట టీవీకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినానంతరం కావేరి తీరంలోని మేఘదాతు వద్ద డ్యాం నిర్మానం దిశగా కర్ణాటక తీవ్ర కసరత్తు చేపట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆగస్టు 3న సీఎం విజయ్ కర్ణాటక వెళ్తున్నారని, ఈ వ్యవహారంపై అక్కడి సీఎం డీకే శివకుమార్తో భేటీ కానున్నారని రాష్ట్రవ్యవసాయ మంత్రి వినోద్ ప్రకటించారు.దీంతో సీఎం కర్ణాటక పర్యటనకు వ్యతిరేకంగా, మద్దతుగా స్వరం అన్నది తమిళనాట బయలు దేరింది. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్, ఐయూఎంఎల్ ఈ పర్యటనను ఆహ్వానించినా, సీపీఎం, సీపీఐ, వీసీకే మౌనంగా ఉంటున్నాయి. అదే సమయంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఈ పర్యటనను వ్యతిరేకించారు. గతంలో సాగిన చర్చల విఫలం గురించి ప్రస్తావిస్తూ, తమిళనాడు హక్కులను తాకట్టు పెట్ట వద్దని, కోర్టు ఇచ్చిన తీర్పును నీరుగార్చే అడుగులు వేయవద్దు అని సీఎం విజయ్కు విజ్ఞప్తి చేశారు. అలాగే, అన్నాడీఎంకే ప్రదాన కార్యదర్శి పళణి స్వామి అయితే అఖిల పక్షం ఏర్పాటు చేయాలని, అందరు కలిసికట్టుగా అడుగుల వేద్దామని పిలుపు నిచ్చారు. అలాగే, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు సైతం సీఎం విజయ్ కర్ణాటక పర్యనను వ్యతిరేకించారు. ఈ వ్యతిరేక పరిణామాల నేపథ్యంలో తమిళనాడు – కర్ణాటక సరిహద్దులలో ఉత్కం అన్నది బయలు దేరింది. ఆదివారంకూడా కన్నడం సంఘాలు ఓ వైపు, తమిళ రైతు సంఘాలు మరోవైపు ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకోవాల్సి వచ్చింది. రెండు రాష్ట్రాల బస్సులు ఆయా రాష్ట్ర సరిహద్దులకే పరిమితం చేయాల్సి వచ్చింది. ఉత్కంఠ మరింత ఉధృతం కాకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
త్వరలో అధికారిక ప్రకటన..
తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి వినోద్ మాట మార్చేశారు.ఆగస్టు 3న సీఎం విజయ్ కర్ణాటక పర్యటనకు సంబంధించి పార్టీ లేదా ప్రభుత్వ ప్రధాన కార్యాలయం నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని దాట వేయడం గమనార్హం. తంజావూరు జిల్లా కుంభకోణం డివిజన్ పరిధిలోని కావేరి, అరసలార్, పళవార్, మోరి మరియు ఆళియనార్ కాలువల్లో రూ. 70 లక్షల వ్యయంతో మొత్తం 31 కిలోమీటర్ల మేర పూడికతీత పనులను మంత్రి వినోద్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మీడియా ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ ముఖ్యమంత్రి విజయ్ కర్ణాటక పర్యటనపై స్పష్టత నిచ్చారు. ఆగస్టు 3న సీఎం విజయ్ కర్ణాటక వెళ్తున్నారని తమరు చెప్పారే, అయితే, పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజమోహన్ అది ఖరారు కాలేదని అంటున్నారే? అని విలేకరులు ప్రశ్నించగా ఈ పర్యటనకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యాలయం నుంచి లేదా పార్టీ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వస్తుందని మంత్రి వినోద్ దాట వేయడం గమనార్హం.


