తిరువొత్తియూరు: నెల్లె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజల సమస్యల పరిష్కార (గ్రీవెన్స్ డే) సమావేశం జరిగింది. అప్పుడు అక్కడికి మోటార్ సైకిల్పై వచ్చిన ఓ రైతు లోపలికి వెళ్లడానికి అనుమతి కోరాడు. పోలీసులు అతడిని తనిఖీ చేయగా, అతడి వద్ద వ్యవసాయ సంబంధిత క్రిమి సంహారక మందు, తాడు ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అతడిని నిలిపివేసి విచారించారు. పోలీసుల విచారణలో అతను తరువై సమీపంలోని ఆలంగుళం ప్రాంతానికి చెందిన అన్నామలై (55) అని, వ్యవసాయం చేస్తున్నాడని తెలిసింది. అంతేకాకుండా అతను తరువై పంచాయతీ 8వ వార్డు మాజీ సభ్యుడిగా కూడా ఉన్నాడు. వ్యవసాయం చేసే అన్నామలై సోమ వారం ఉదయం నైల్లె టౌన్కు వెళ్లి తన పని నిమిత్తం కొన్ని వస్తువులను కొనుగోలు చేసి, అక్కడి నుండి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చినట్లు తెలిసింది. పోలీసులు అతడి వద్ద ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ అనంతరం అతడిని లోపలికి అనుమతించారు.
పళ్లిపట్టు: కాంగ్రెస్ నాయకుడు, పళ్లిపట్టు మాజీ ఎమ్మెల్యే దివంగత ఏకాంబరరెడ్డి శత జయంతి ఉత్సవ వేడుకలకు అసెంబ్లీ సభాపతికి కాంగ్రెస్ శ్రేణులు ఆహ్వానించారు. పళ్లిపట్టు ఎమ్మెల్యేగా, కాంగ్రెన్ నాయకుడిగా గుర్తింపు పొందిన ఏకాంబర రెడ్డి శత జయంతి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పళ్లిపట్టు వేదికగా చేపట్టనున్న కార్యక్రమంలో ముఖ్య అతిధిగా అసెంబ్లీ సభాపతి జేసీడీ ప్రభాకర్ను అసెంబ్లీలో కాంగ్రెస్ శ్రేణులు వెంకటరాజు, తిరుత్తణి వెంకటేశన్, ఉమాపతి, రంగనాథన్ తదితరులు సోమవారం కలుసుకుని ఏకాంబరరెడ్డి శత జయంతి వేడుకలకు ఆహ్వానం పలికారు. కచ్చితంగా పాల్గొంటానని సభాపతి హామీ ఇచ్చినట్లు వేడుకల ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి.
కొరుక్కుపేట: ప్రభుత్వం గత సంవత్సరం వ్యవసాయ రంగంలో రైతు అధికారి అనుసంధాన పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి నిరసనగా తమిళనాడు ఉద్యానవన అధికారుల సంఘం సమాఖ్య పలు నిరసనలు చేపట్టింది. ఈమేరకు ఈనెల 21వ తేదీ నుండి చైన్నెలోని చెపాక్లో ఉన్న ఎళిలగం క్యాంపస్లో నిరవధిక నిరసన జరుగుతుందని ప్రకటించారు. ఈ విషయంలో, ఫెడరేషన్ ఆఫ్ తమిళనాడు హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్లు శివకుమార్ మురుగన్ మాట్లాడారు. రైతులు అత్యంత వినాశకరమైన ఈ సమస్యపై ప్రభుత్వ దష్టిని ఆకర్షించేందుకు మంగళవారం నుంచి నిరవధిక సమ్మె జరగనుందన్నారు. ఇందులో తమిళనాడులోని 38 జిల్లాల నుంచి వెయ్యికి పైగా ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, వ్యవసాయ వ్యాపార అండ్ మార్కెటింగ్ శాఖ అనే మూడు విభాగాల నుండి క్షేత్రస్థాయి కార్యకర్తలను ఒకచోట చేర్చి, వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగాన్ని పై మూడు విభాగాలతో అనుసంధానించడం, తద్వారా అన్ని ప్రాజెక్టులను ఒకే క్షేత్రస్థాయి కార్యకర్త నిర్వహించగలదని వెల్లడించారు.దీనికి సంబంధించిన అన్ని ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసే వరకు ఈ నిరవధిక నిరసన కొనసాగుతుందన్నారు.
నారాయణవనం: తిరుమలకు పాదయాత్రగా వెలుతున్న గోవిందమాల భక్తులకు సోమ వారం స్థానికులు అన్నప్రసాదం అందించారు. చైన్నెకి చెందిన సుమారు 150 మంది గోవింద మాలను ధరించిన భక్తులకు స్థానిక రేషన్ డీలర్ కందస్వామి, డిప్యూటీ ఎంపీడీఓ రవి కుమార్, కేబుల్ టీవీ ఆపరేటర్ గిరి ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. దాతలు మాట్లాడుతూ కొందరి స్నేహితులతో కలిసి గత 14 ఏళ్లుగా చైన్నె నుంచి కాలినడకన తిరుమల వెళుతున్న భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు.


