సీఎం విజయ్ ఆకాంక్ష
సీఎం విజయ్
సాక్షి, చైన్నె: తమిళనాడు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం విజయ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మకమైన రోజున, తమిళనాడును భారతదేశంలోనే అన్ని రంగాలలో అగ్రగామి (నంబర్ వన్) రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం విజయ్ తన సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ సందేశాన్ని పంచుకున్నారు. తమిళుల ప్రాచీనత, ఘనమైన చరిత్ర, సంస్కృతి , భాషా చైతన్యానికి గౌరవసూచకంగా రాష్ట్రానికి తమిళనాడు అని నామకరణం చేస్తూ నాటి శాసనసభలో తీర్మానం ఆమోదించిన చారిత్రాత్మక రోజు ఇదే అని వ్యాఖ్యలు చేశారు. ఈ పవిత్రమైన ’తమిళనాడు దినోత్సవం’ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.
రెండు ముఖ్యమైన రోజులు
మద్రాసు రాష్ట్రం ఏర్పడిన నవంబర్ 1వ తేదీని, అలాగే పెరరిగ్నర్ అన్నాదురై నేతృత్వంలోని శాసనసభలో రాష్ట్రానికి తమిళనాడు అని పేరు మార్చాలనే చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదించిన జూలై 18వ తేదీ అంటూ ఈ రెండు రోజులను తమ ప్రభుత్వం అధికారికంగా జరుపుకోబోతోందని ప్రకటించడానికి సంతోషిస్తున్నానని సీఎం తెలిపారు. ‘సమానత్వం, సామాజిక న్యాయం వర్ధిల్లేలా.. విద్య, ఆధునిక సాంకేతికత, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధిలో రాణిస్తూ, శాసీ్త్రయ భాషా సంపదకు పుట్టినిల్లుగా ఉన్న తమిళనాడును భారతదేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా నిలబెట్టాలని అందరం ప్రతిజ్ఞ చేద్దాం అని పిలుపునిచ్చారు. చివరగా, తమిళ భాషా మాధుర్యం, తమిళుల ఉన్నత సంస్కృతి , మానవతా సంప్రదాయం రాబోయే తరాలకు సగర్వంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ, తమిళనాడు రాష్ట్ర ఏర్పాటు కోసం , తమిళ గుర్తింపు కోసం కఠోర శ్రమ చేసిన అమరవీరులను, త్యాగధనులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ సీఎం విజయ్ వారికి ఘన నివాళులర్పించారు. కాగా, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సైతం తమిళనాడు దినోత్సవాన్ని పురస్కరించుకుని లండన్ నుంచి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలుతెలియజేస్తూ, తన సందేశాన్ని పంపించారు.


