సాక్షి, చైన్నె: తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి యత్నిస్తున్నాయని, ఏడాది కాలంలో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలను నడపలేక బీజేపీలో విలీనం చేయడం ఖాయమని మంత్రి నిర్మల్ కుమార్ ఆరోపించారు. గురువారం చైన్నెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్నాడిఎంకేకు పార్టీని కాపాడుకోవాలనే ఆలోచన లేదన్నారు. స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి కుటుంబాల నుండి ఇద్దరికి కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవులు దక్కించుకునేలా వారు ఒక ఒప్పందానికి వచ్చినట్టుందన్నారు. ఎంజీఆర్, జయలలిత నిర్మించిన పార్టీని ఎడప్పాడి పళణి స్వామి తాకట్టు పెట్టేశారని ఆరోపించారు. కేవలం ఒక లెటర్ ప్యాడ్, ఒక ఆఫీస్ ఉంటే చాలు అన్నట్లుగా ఆయన కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. స్టాలిన్ సైతం తదుపరి పార్టీని ఎవరికి అప్పగించాలో తెలియక అయోమయంలో ఉన్నార ని విమర్శించారు. టివికె ప్రభుత్వానికి విఘాతం కలిగించడానికి,తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. త్వరలో డీఎంకేలోకి అన్నాడీఎంకేను పళణిస్వామి విలీనం చేసినా చేయవచ్చు అని జోస్యం చెప్పారు. డీఎంకే, అన్నాడీఎంకేలు బీజేపీని శరణు గోరి ఉన్నాయని, ఈ ముగ్గురు కలిసి తమిళనాడులో ప్రభుత్వ ఏర్పా టు దిశగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇది ఆధవ్ అర్జున రచించిన వ్యూహం
అన్నాడీఎంకే పునాదులను ఖాళీ చేయడమే విజయ్ ప్రధాన లక్ష్యం అని మాజీ మంత్రి, డీఎంకే నేత ఎస్ఎస్ శివశంకర్ వ్యాఖ్యానించారు. పెరంబలూరు జిల్లా కున్నం నియోజకవర్గంలో తన ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలోనే డీఎంకే, టీవీకే మధ్యే ప్రధాన పోటీ అని విజయ్ చెప్పారని పేర్కొన్నారు. బీజేపీ నేరుగా తమిళనాడులో అధికారంలోకి రాలేక అన్నామలైను తెర వెనుక రాజకీయ రంగంలోకి అడుగు పెట్టేలా చేసి ఉన్నారన్నారు. డీఎంకే, అన్నాడీఎంకేల ఏకం అన్నది మంత్రి ఆధవ్ అర్జున వ్యూహం అని, ఇందుకు డీఎంకేలో అవకాశం లేదని స్పష్టంచేశారు.


