● బ్రహ్మాండ రూపురేఖలు ● రూ. 14.79 కోట్లతో పూర్తయిన నిర్మాణాలు ● నేడు పీఎం చేతుల మీదుగా ప్రయాణికుల సేవకు
మల్టీమోడల్ హంగులతో
సాక్షి, చైన్నె: రాజధాని నగరం చైన్నెలో పురాతన స్టేషన్గా పార్క్ పేరు గడించి ఉంది. చైన్నె బీచ్ – చెంగల్పట్టు మార్గంలో ఉన్న ఈ చైన్నె పార్క్ రైల్వే స్టేషన్కు భారతీయ రైల్వే చరిత్రలో ఒక విశిష్టమైన స్థానం ఉంది. దక్షిణ భారత రైల్వే కంపెనీచే నిర్మితమైన ఈ స్టేషన్, దేశంలోనే మొట్టమొదటి విద్యుద్దీకరణ చేయబడిన సబర్బన్ మార్గమైన చైన్నె బీచ్ – తాంబరం ట్రాక్లో ఒక భాగం ఉంది. 1928లో పట్టాల ఏర్పాటు పనులు ప్రారంభమై, 1931 మే 11న అధికారికంగా స్టేషన్ రూపుదిద్దుకుంది. బ్రిటిష్ కాలం నాటి ఒక సాధారణ సబర్బన్ స్టాప్ నుండి, ప్రస్తుతం రోజుకు 198 సబర్బన్ రైళ్లు , 29,000 మంది ప్రయాణికుల రద్దీని తట్టుకుంటూ, దక్షిణ భారతదేశంలోనే అత్యంత కీలకమైన మల్టీమోడల్ (బహుళ రవాణా) అనుసంధాన కేంద్రంగా ఈ స్టేషన్ రూపాంతరం చెందింది.
బ్రహ్మాండ హంగులు
మల్టీ మోడల్ రవాణా సేవలతో వేదికగా పార్క్ స్టేషన్ను బ్రహ్మాండ హంగులతో ప్రస్తుతం తీర్చిదిద్దారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం మేరకు పునరుద్ధరించిన ఈ రైల్వే స్టేషన్లో సరికొత్త ప్రవేశ ద్వార మార్గాన్ని నిర్మించారు. చైన్నె నగరానికి కొత్త ఆకర్షణగా నిలిచే అందమైన ల్యాండ్మార్క్ టవర్తో రీడిజైన్ చేశారు. ప్రయాణికులు స్టేషన్ లోపల సులభంగా మార్గాలను కనుగొనడానికి వీలుగా, ఆధునిక , స్పష్టంగా కనిపించే సమాచార బోర్డులను స్టేషన్ అంతటా ఏర్పాటు చేశారు. స్టేషన్ లోపలి భాగంలో, వెయిటింగ్ హాళ్లతో కూడిన కొత్త టికెట్ బుకింగ్ కౌంటర్, ప్లాట్ఫారమ్లు 1, 1–ఏ, 2 లలో ఆధునిక ఫ్లోరింగ్, అదనపు ప్లాట్ఫారమ్ షెడ్లు , స్టేషన్ మొత్తం పైకప్పులను పూర్తిగా కొత్తగా మార్చారు. బహుళ రవాణా అనుసంధానితను మరింత సులభతరం చేయడానికి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్పై రెండు కొత్త లిఫ్టులను ఏర్పాటు చేశారు. దీనితో పాటూ ఎలివేటెడ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారమ్లను నేరుగా అనుసంధానించే ప్రత్యేక నడక మార్గాలను, మెట్రో రైలు మార్గాన్ని సులభంగా చేరుకోవడానికి అండర్పాస్ (సొరంగ మార్గం) మార్గాలను కూడా అందుబాటులోకి తెచ్చారు.లిఫ్టులు, ప్రత్యేక నడక మార్గాలు, స్పష్టమైన సైన్ బోర్డుల ద్వారా ప్రయాణికులు ఒక రవాణా మార్గం నుండి మరో రవాణా మార్గానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా మారవచ్చు. ఇది సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు , సమీపంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగుల ప్రయాణ అనుభవాన్ని ఎంతగానో సులభతరం చేస్తుంది. మెరుగైన రవాణా వసతులు, గంభీరమైన ముఖద్వారం, ప్లాట్ఫారమ్లపై తగ్గిన రద్దీ , సులభమైన మల్టీమోడల్ కనెక్టివిటీతో, పునరుద్ధరించబడిన చైన్నె పార్క్ రైల్వే స్టేషన్ చైన్నె మహానగరానికి సురక్షితమైన , సమర్థవంతమైన రవాణా ప్రవేశ ద్వారంగా నిలవడానికి సిద్ధంగా ఉంది. మరికొన్నిగంటల్లో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ బ్రహ్మాండ స్టేషన్ను ప్రారంభించి, ప్రయాణికుల సేవకు అంకితం చేయనున్నారు.


