సాక్షి, చైన్నె : సీఎం విజయ్ అధ్యక్షతన గురువారం సచివాలయంలో మంత్రి వర్గం భేటి జరిగింది. ఇందులో కొత్త ప్రభుత్వం తొలి బడ్జెట్ను అసెంబ్లీలో దాఖలు చేయడం లక్ష్యంగా ఆర్థిక నివేదిక రూపకల్పనకు ఆమోదించారు.
సచివాలయంలోని నామక్కల్ కవింజ్ఞర్ మాళిగైలో సీఎం విజయ్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశానికి అధికారులు, మంత్రులు అందరూ హాజరయ్యారు. అధికారంలోకి వచ్చినానంతరం ఇది రెండవ కేబినెట్ భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి స్థాయిలో బడ్జెట్ను ఇంకా సభలో ప్రవేశ పెట్టలేదు. ఇందుకు సంబంధించిన కసరత్తులు జరుగుతూ వస్తున్నాయి. గత పదిరోజులకు పైగా సీఎం విజయ్ శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ బడ్జెట్లో చేర్చాల్సిన అంశాలపై నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్, అలాగే వ్యవసాయ బడ్జెట్పై ప్రధానంగా చర్చలు జరిగాయి. వీటితో పాటు మంత్రుల శాఖల వారీగా జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారని, రాబోయే రోజుల్లో అమలు చేయబోయే సరికొత్త ప్రజాసంక్షేమ పథకాలపై కూడా చర్చించినట్లు సమాచారం.
మంత్రి నిర్మల్కుమార్ ఏమన్నారంటే..
కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, మంత్రివర్గ సమావేశం పూర్తిగా రాబోయే బడ్జెట్కు సంబంధించినదిగా సాగిందన్నారు. బడ్జెట్ రహస్యాల నియమావళి ప్రకారం దీని గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు బయటకు వెల్లడించలే మన్నారు. బడ్జెట్ను ఏ విధంగా ప్రవేశపెట్టాలి, రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపైనే ఈ సమావేశంలో మంత్రులందరితో సీఎం చర్చించడం జరిగింది అని వివరించారు. కాగా, ఎన్నికల వాగ్దానాలు కొన్నింటిని బడ్జెట్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి అమలు చేయడానికి నిర్ణయించినట్టు సమాచారం. తుది బడ్జెట్ రూపకల్పన, అసెంబ్లీని సమావేశ పరిచేందుకు కెబినెట్ ఆమోదం తెలిపినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అనంతరం సీఎం విజయ్ వ్యవసాయ శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి, ఆ శాఖ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వ్యవసాయ బడ్జెట్ రూపకల్పనకు సంబంధిచంఇ చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.


