సాక్షి, చైన్నె : అన్నాడిఎంకె మాజీ మంత్రులు సి. విజయభాస్కర్, ఎం.ఆర్. విజయభాస్కర్ రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సమాధానం ఇవ్వాలని శాసనసభ కార్యదర్శిని చైన్నె హైకోర్టు ఆదేశించింది. అన్నాడిఎంకె విప్ అగ్రి కృష్ణమూర్తి ఈ పిటిషన్ దాఖలైంది. ఇటీవలిఅసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన అన్నాడీఎంకే ఎ మ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామా చేసి టీవీకేలోచేరుతున్న విషయం తెలిసిందే. ఆ దిశగా విరాళి మలై ఎమ్మెల్యే సి విజయ భాస్కర్, కరూర్ ఎమ్మెల్యే ఎంఆర్ విజయ భాస్కర్లు అడుగులు వేశారు. వీరిద్దరి రాజీనామాను తక్షణం స్పీకర్ జేసిడీ ప్రభాకర్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సదరు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల కింద అనర్హత వేటు ప్రక్రియ పెండింగ్లో ఉన్న సమయంలో, వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదించడం చట్టవిరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. స్పీకర్ ఎలాంటి విచారణ జరపకుండా, యాంత్రికంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, అందువలన న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ రెండు నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్టు జారీ చేసిన ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించాలని విన్నవించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుళ్మురుగన్లతో కూడిన ధర్మాసనం.. శాసనసభ కార్యదర్శితో పాటు సి. విజయభాస్కర్, ఎం.ఆర్. విజయభాస్కర్లకు నోటీసులు జారీ చేస్తూ, వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే మరో నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులతో పాటు, ఈ రెండు కేసులను కూడా కలిపి విచారణకు లిస్ట్ చేయాలని రిజిస్టార్ను ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈనెల 22కి న్యాయమూర్తులు వాయిదా వేశారు.


