తిరుత్తణి: ఎడపాడి పళనిస్వామి సీఎం కావాలనే లక్ష్యంతో కార్యకర్తలు కలసికట్టుగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని తిరుత్తణి అన్నాడీఎంకే అభ్యర్థి హరి పార్టీ శ్రేణులకు సూచించారు. తిరుత్తణి తూర్పు మండల అన్నాడీఎంకే ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని తిరుపతి–చైన్నె జాతీయ రహదారిలోని వెంకటాపురం వద్ద ప్రారంభించారు. మండల అన్నాడీఎంకే కార్యదర్శి వేలంజేరి కవిచంద్రన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నాడీఎంకే ఆర్గనైజింగ్ కార్యదర్శి, తిరుత్తణి అభ్యర్థి హరి నూతన కార్యాలయం ప్రారంభించి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సీఎం కావాలనే లక్ష్యంతో కార్యకర్తలు కూటమి పార్టీల కార్యకర్తలను కలుపుకుని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టాలన్నారు. డీఎంకే ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించి మహిళలకు భద్రత కరువైందన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడితే అనేక పథకాలు అమలవుతాయని మహిళలకు మేలు జరుగుతుందని చెప్పి ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు.


