సూర్యాపేట : శంషాబాద్ నుంచి చైన్నె వెళ్లే బుల్లెట్ రైల్ అలైన్మెంట్ను సూర్యాపేట మీదుగా కొనసాగించే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని సూర్యాపేట పట్టణ వర్తక, వ్యాపార, వాణిజ్య, విద్య, వైద్య, వృత్తి సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. ఈమేరకు గురువారం సూర్యాపేటలో ప్రభాత భేరీ మోగించాయి. పట్టణంలోని సద్దల చెరువు బతుకమ్మ ఘాట్ దీక్షా శిబిరం నుంచి శంకర్ విలాస్, ఎంజీ రోడ్డు మీదుగా కొత్త బస్టాండ్ వరకు బుల్లెట్ ట్రైన్ సాధన లక్ష్యంగా భారీ ర్యాలీ నిర్వహించారు. బుల్లెట్ ట్రైన్ సాధనకు మరెన్నో ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. అవసరమైతే పట్టణ బంద్కు కూడా వెనకాడబోమని ప్రకటించారు. అనంతరం కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ వద్ద మానవహారం నిర్వహించారు. ర్యాలీలో పట్టణ వర్తక వాణిజ్య వ్యాపార సంఘాలతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థలు, వైద్యులు, వృత్తి సంఘాల నాయకులు, బుల్లెట్ ట్రైన్ సాధన ఉద్యమ నేతలు పాల్గొన్నారు.


