సూర్యాపేటటౌన్ : ప్రతి పౌరుడికి పోలీసు సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లా పోలీస్ అధికారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల తీరుతెన్నులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, కోర్టు కేసుల పరిస్థితి, అట్రాసిటీ కేసులు, సెంటర్ కంప్లైంట్ సెల్ ఫిర్యాదులు, 30 రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు, పొక్సో కేసుల దర్యాప్తు వంటి అంశాలపై సమీక్షించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న వినాయక చవితి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం సందర్భంగా జిల్లాలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ప్రణాళికతో భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. వినాయక మండపాల ఏర్పాటు విషయంలో నిర్వాహకులు నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. మండపాల వద్ద భద్రతా చర్యలు, విద్యుత్ సౌకర్యం, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకునేలా అధికా రులు చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, పోలీస్ టెక్నికల్, కమ్యూనికేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


