గోదావరి జలాలు 1850 క్యూసెక్కులకు పెంపు
అర్వపల్లి: ప్రస్తుత యాసంగి సీజన్కుగాను జిల్లాకు వారబంధీ విధానంలో వస్తున్న గోదావరి జలాలను సోమవారం 1800 క్యూసెక్కుల నుంచి 1850 క్యూసెక్కులకు పెంచినట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. పంటలకు నీళ్లు చేరేలా రోజురోజుకు నీటిని పెంచుతున్నట్లు పేర్కొన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు.
తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదే
సూర్యాపేటటౌన్ : వృద్ధ్యాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పోషణ బాధ్యత వారి పిల్లలదేనని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను విస్మరిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి సమస్యలు ఉన్న ప్రజలు పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మిసమేత లక్ష్మీ నరసింహస్వామి నిత్యకల్యాణాన్ని సోమవారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్లలను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం జరిపించారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిదంగా క్షేత్రంలోని శివాలయంలో శ్రీపార్వతీ రామలింగేశ్వరస్వామికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు.
పీఆర్టీయూతోనే
ఉపాధ్యాయులకు సౌకర్యాలు
సూర్యాపేటటౌన్ : పీఆర్టీయూ స్థాపించిన తరువాతే ప్రభుత్వ ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు అందాయని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తంగెళ్ల జితేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో పీఆర్టీయూ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ముందుగా సంఘ వ్యవస్థాపకుడు సామల యాదగిరి చిత్రపటానికి నివాళులర్పించి, పీఆర్టీయూ జెండా ఆవిష్కరించారు. అనంతరం సంఘం అభివృద్ధికి విశేష కృషి చేసిన రిటైర్డ్ ఉపాధ్యాయులు, మాజీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కాసర్ల వీరారెడ్డి, యగ్గడి వెంకటేశ్వర్లు, పారుపల్లి చంద్రశేఖర్, యర్ర హరికిషనన్ను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు కొండేటి రవీందర్ రెడ్డి, చింతరెడ్డి రామలింగారెడ్డి, కందుకూరి శివశంకర్, చిప్పలపల్లి ధర్మయ్య, దండుగుల యల్లయ్య, కట్కూరి మధుసూదన్ రెడ్డి, మన్నెం వెంకట్ రెడ్డి, తావీర్య, శంకర్ పాల్గొన్నారు.
గోదావరి జలాలు 1850 క్యూసెక్కులకు పెంపు
గోదావరి జలాలు 1850 క్యూసెక్కులకు పెంపు


