అస్తవ్యస్తం.. అగమ్యగోచరం!
మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా పనిచేయిస్తున్నాం. సిబ్బంది, వాహనాల కొరత వల్ల కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సెగ్రిగేషన్ షెడ్ వద్ద రెండు కొత్త ట్రాక్టర్లను ఎందుకు ఉంచారో మాకు తెలియదు. వాటిని మాకు అప్పగించలేదు.
– ఎం.సురేష్, శానిటరీ ఇన్స్పక్టర్,
కోదాడ మున్సిపాలిటీ
కోదాడ: కోదాడ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పరిస్థితి అస్తవ్యస్తంగా.. అగమ్యగోచరంగా కనిపిస్తోంది. 80 వేల జనాభా ఉన్న పట్టణంలో పారిశుద్ధ్య సమస్య పెను సవాలుగా మారింది. పారిశుద్ధ్య సిబ్బంది, వాహనాల కొరతతో ఇంటింటి చెత్త సేకరణ నాలుగైదు రోజులకు ఒకసారి చేయడమే గగనమైపోతుంది. మరోపక్క లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన కొత్త వాహనాలను మూలన పడేశారు. మున్సిపాలిటీలో ఎన్ని వాహనాలున్నాయి..? ఎన్ని పనిచేస్తున్నాయి...? రిపేర్కు ఇచ్చిన వాహనాలు ఎన్ని అనే లెక్కలే అధికారుల వద్ద లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సగం సిబ్బందితో సతమతం..
కోదాడ మున్సిపాలిటీలో ప్రస్తుతం 35 వార్డులున్నాయి. వార్డుకు ఐదుగురు సిబ్బంది, ఒక వాహనం, ఒక డ్రైవర్ చొప్పున ఆరుగురు పారిశుద్ధ్య విభాగానికే ఉండాలి. కానీ, ప్రస్తుతం సగం వార్డులకు ఇద్దరు.. సగం వార్డులకు ముగ్గురు చొప్పున మాత్రమే సిబ్బంది ఉన్నారు. 35 చెత్త సేకరణ ఆటోలు కావాల్సి ఉండగా కేవలం 18 మాత్రమే ఉన్నాయి. వీటిలో కొన్ని తరచూ రిపేర్కు వస్తున్నాయి. రిపేర్కు వెళ్లిన వాహనాలు మళ్లీ తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. గతంలో బ్యాటరీతో నడిచే ఐదు ఆటోలను మున్సిపాలిటీ కొనుగోలు చేసింది. అవి కనిపించకుండా పోయాయి. ప్రస్తుతం అవి ఎక్కడ ఉన్నాయో మున్సిపాలిటీ అధికారులే చెప్పలేక పోతున్నారు. చెత్తను డంపింగ్ యార్డులకు తరలించడానికి ఎనిమిది ట్రాక్టర్లు అవసరం కాగా ప్రస్తుతం నాలుగే పనిచేస్తున్నాయి. రెండు కొత్త ట్రాక్టర్లను రూ.16 లక్షలు పెట్టి కొనుగోలు చేసి సెగ్రిగేషన్ షెడ్లో పడేశారు. అక్కడెందుకు పెట్టారంటే మాకు తెలియదని.. మాకు అప్పగించలేదని శానిటేషన్ అధికారులు అంటున్నారు.
సిబ్బందిని నియమించుకునే
వెసులుబాటు ఉన్నా..
మున్సిపాలిటీలో పాలన గాడితప్పడంతో ఎవరిని ఎవరూ అజమాషీ చేయలేని పరిస్థితి నెలకొంది. గతంలో పారిశుద్ధ్య సిబ్బంది తక్కువగా ఉన్నారని 70 మందిని అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకున్నారు. వీరి నియామకం కోసం కౌన్సిలర్లు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు రావడంతో రెండేళ్ల తర్వాత వారిని తొలగించారు. దీంతో అప్పటి నుంచి ఉన్న అరకొర సిబ్బందితో పనిచేయిస్తున్నారు. పారిశుద్ధ్య విభాగానికి మరో వంద మంది కార్మికులను పెట్టుకొనే వెసులుబాటు ఉన్నపటికీ ఎవరూ పట్టించుకోవడంలేదు. విచిత్రమేమిటంటే పనిచేసే వారికంటే పని చేయిస్తామని చెప్పుకొనే జవాన్ల సంఖ్య పెరిగి పోయింది. మరి కొందరు మున్సిపాలిటీ నుంచి వేతనం తీసుకుంటూ నేతలు, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధుల ఇళ్లలో సేవకులుగా మారారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా మున్సిపల్ యంత్రాంగం స్పందించి సరిపడా సిబ్బందిని నియమించి రోజూ ఇంటింటా చెత్తను సేకరించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
కోదాడ పట్టణంలో
పడకేసిన పారిశుద్ధ్యం
ఫ నాలుగు రోజులకు ఒకసారి
ఇంటింటి చెత్త సేకరణ
ఫ పనిచేసేవారు తక్కువ..
చేయించేవారు ఎక్కువ
ఫ వాహనాల కొరతతోనూ సతమతం
ఫ మూలనపడిన కొత్త వాహనాలు
పారిశుద్ధ్య కార్మికులు
(అవుట్ సోర్సింగ్) 146
ఎన్ఎంఆర్లు 11
రెగ్యులర్ కార్మికులు 21
చెత్త సేకరణ ఆటోలు 18
ట్రాక్టర్లు 04
జేసీబీ 01
వైకుంఠధామం వాహనం 01
ఈ ఫొటో కోదాడ మున్సిపాలిటీ రెండున్నరేళ్ల క్రితం రూ.16 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన కొత్త ట్రాక్టర్లు. వీటిని ఊరి చివరన ఉన్న సెగ్రిగేషన్ షెడ్డు వద్ద పడేయడంతో నిరుపయోగంగా మారాయి. వీటిని ఎందుకు కొనుగోలు చేశారు..? అక్కడ ఎందుకు ఉంచారు..? అంటే అధికారులు ఆ విషయం మాకు తెలియదంటున్నారు. మరోపక్క వాహనాల కొరతతో పట్టణంలో చెత్త తరలించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ అధికారులే చెప్పడం గమనార్హం.
అస్తవ్యస్తం.. అగమ్యగోచరం!


