
వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి
గుండాల: వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గుండాల మండలం అంబాల గ్రామ శివారులో మంగళవారం జరిగింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రగూడేనికి చెందిన చిర్ర బాలరాజు(55) హైదరాబాద్లోని నేరేడ్మెట్లో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య గతంలోనే మృతిచెందింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బాలరాజు తన అత్తగారి ఊరైన ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి గ్రామంలో మైసమ్మ పండుగకు హాజరయ్యేందుకు ఆదివారం హైదరాబాద్ నుంచి బస్సులో బయల్దేరి మోత్కూరులో దిగాడు. అక్కడి నుంచి పారుపల్లి గ్రామంలోని తన అత్తగారి వ్యవసాయ బావి వద్దకు వెళ్లేందుకు ఆత్మకూరు(ఎం) మండలం మోదుబావిగూడెం, గుండాల మండలం అంబాల గ్రామ శివారులోని బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వాగులో జారిపడి కొట్టుకుపోయాడు. మంగళవారం అంబాల గ్రామ శివారులో బిక్కేరు వాగు ఒడ్డున బాలరాజు మృతదేహాన్ని స్థానిక రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తేజమ్రెడ్డి తెలిపారు.
కుక్కల దాడిలో
ఇద్దరికి గాయాలు
నాగారం: కుక్కల దాడిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో మంగళవారం జరిగింది. ఫణిగిరి గ్రామానికి చెందిన షేక్ షఫీ స్థానిక మేరీ మదర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో అటెండర్గా, తుంగతుర్తికి చెందిన జటంగి సతీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మంగళవారం షఫీ పాఠశాల వెనుక గదిలోకి వెళ్లగా.. అక్కడ కుక్కలు ఉండడంతో వాటిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో కుక్కలు అతడిపై దాడి చేశాయి. అతడు కేకలు వేయగా సమీపంలో ఉన్న ఉపాధ్యాయుడు సతీష్ వచ్చి షఫీని విడిపించే ప్రయత్నం చేయగా.. అతడిపై కూడా కుక్కలు దాడి చేసి ఛాతి భాగంలో గాయపరిచాయి.