
ముగిసిన పదోన్నతుల ప్రక్రియ
పదోన్నతుల వివరాలు ఇవే..
సూర్యాపేటటౌన్ : ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఈనెల 21న పదోన్నతుల ప్రక్రియ ప్రారంభంకాగా మొదటగా అర్హులైన స్కూల్ అసిస్టెంట్లను జీహెచ్ఎంలుగా పదోన్నతి కల్పించారు. ఆ తర్వాత ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్, పీఎస్ హెచ్ఎంలుగా ప్రమోషన్ కల్పించేందుకు ఈ నెల 25న రాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్జీటీల నుంచి ప్రమోషన్లు పొందిన పీఎస్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లకు ఆర్డర్లు ఇచ్చారు. వెంటనే ప్రమోషన్ పొందిన పాఠశాలలో జాయిన్ కావాలని ఆదేశాలు జారీ చేశారు.
24 మందికి జీహెచ్ఎంలుగా ప్రమోషన్
జిల్లాలో మొత్తం 24 జీహెచ్ఎంల పోస్టులు ఖాళీలు ఉన్నట్టు గుర్తించిన జిల్లా విద్యాశాఖ అధికారులు ఆ దిశగా ప్రక్రియ కొనసాగించారు. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్ఎంలుగా ప్రమోషన్లు కల్పించారు. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లు 24 మందికి ప్రమోషన్లు రాగా అందులో నలుగురు ఇతర జిల్లాలకు వెళ్లగా మరో నలుగురు సూర్యాపేట జిల్లాకు వచ్చారు. గెజిటెడ్ హెచ్ఎంలుగా గత గురువారం రాత్రి ఉత్తర్వులు అందుకున్నారు. వీరు వెంటనే ఆయా పాఠశాలల్లో విధుల్లో చేరారు.
111 మంది పీఎస్ హెచ్ఎం,
స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి...
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందిన వారి ఖాళీ స్థానాలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)తో భర్తీ చేసేందుకు పదోన్నతుల ప్రక్రియ గత శుక్రవారం ప్రారంభించారు. సీనియారిటీ జాబితాను డీఈఓ వెబ్సైట్లో పొందుపరిచి ప్రక్రియ కొనసాగించారు. ఈ నెల 23న ఎస్జీటీల నుంచి వివిధ కేటగిరీలలోని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన వారి జాబితాను ప్రదర్శించగా, ఈ నెల 24, 25, 26 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లు, పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతులకు కసరత్తు కొనసాగింది. జిల్లాలో మొత్తం 111 మంది ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. వీరు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు.
జీహెచ్ఎంలు 24
పీఎస్ హెచ్ఎంలు 28
ఎస్ఏ(బయోసైన్స్) 17
ఎస్ఏ(ఇంగ్లిష్) 13
ఎస్ఏ(మ్యాథ్స్) 13
ఎస్ఏ(ఫిజికల్ ఎడ్యుకేషన్) 05
ఎస్ఏ(ఫిజికల్ సైన్స్) 05
ఎస్ఏ(సోషల్) 30
ఫ జిల్లాలో 24 మంది స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్ఎంలుగా ప్రమోషన్
ఫ 111 మంది ఎస్జీటీలకు ఎస్ఏలు, పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతి
ఫ వెంటనే జాయిన్ కావాలని
ఆర్డర్లు ఇచ్చిన డీఈఓ