
గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి అరెస్టు
నకిరేకల్: గంజాయి విక్రయిస్తున్న, సేవిస్తున్న ఆరుగురిని నకిరేకల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం నకిరేకల్ సీఐ వెంకటేష్ విలేకరులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణ శివారులోని తాటికల్ రోడ్డులో కుమ్మరిబావి దగ్గరలోని చెట్ల పొదల్లో శనివారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు దాడులు చేశారు. అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న, కొనుగోలు చేసి సేవిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ గంజాయి దందాలో మొత్తం ఎనిమిది ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వారి నుంచి రూ.32,500 విలువ చేసే 1.290 కిలోల గంజాయి, 7 సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆరుగురిలో నకిరేకల్లోని తాటికల్ రోడ్డు వాసి యన్నమల్ల సాయిరాం, నల్లగొండలోని ఎన్జీఓస్ కాలనీకి చెందిన బోరిగం సంపత్కుమార్, నకిరేకల్లోని ఎస్ఎల్బీసీ కాలనీకి చెందిన ముక్కాముల అఖిల్, నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన పల్లెబోయిన శివ, శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన బండారి వినయ్, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంటకు చెందిన కుంచం నవీన్తో పాటు ఓ బాల నేరస్తుడు ఉన్నారు. నల్లగొండకు చెందిన సమీర్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. వీరాంతా కలిసి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో ఈ కేసు విచారణ చేస్తున్నామని సీఐ వెల్లడించారు. స్థానిక ఎస్ఐలు లచ్చిరెడ్డి, క్రిష్ణాచారి, పోలీస్ సిబ్బంది వై. వెంకటేశ్వర్లు, కె. జనార్దన్, బి. మధుకర్, వి. సురేష్, డి. శ్రీకాంత్, ఎం. నాగర్జున్ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించినట్లు తెలిపారు.
1.290 కిలో గంజాయి, 7 సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం