పల్లెల్లో పారిశుద్ధ్య జోన్లు
పనితీరు మెరుగు..
పంచాయతీల్లో పారిశుద్ధ్య పనితీరును మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్య జోన్ల ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గృహాలు, విస్తీర్ణం బట్టి కార్యదర్శులు ప్రతి పంచాయతీలో జోన్లను ఏర్పాటు చేశారు.
– కె. యాదగిరి, జిల్లా
పంచాయతీ అధికారి, సూర్యాపేట
●
నాగారం : గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛదనం–పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం కొత్త కార్యాచరణ చేపట్టింది. ఇంటింటికీ చెత్త సేకరణ, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, మురుగు కాలువలు, రహదారుల శుభ్రతను మెరుగుపర్చేందుకు కొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. పంచాయతీల్లో పారిశుద్ధ్య సమస్య పెరిగిపోవడం, సరిపడా కార్మికులు లేక పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని గుర్తించిన ప్రభుత్వం పారిశుద్ధ్య జోన్లను తెరపైకి తెచ్చింది. ప్రతి గ్రామాన్ని నివాస గృహాలు, విస్తీర్ణం, కార్మికుల సంఖ్యను బట్టి పారిశుద్ధ్య జోన్లుగా విభజించారు. చిన్న పంచాయతీలైతే కనిష్టంగా 2 జోన్లు, పెద్ద పంచాయతీలైతే గరిష్టంగా 4 జోన్లను ఏర్పాటు చేశారు. ఈ కొత్త విధానంతో గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మరింత మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
సేంద్రియ ఎరువుల తయారీకి..
ఇళ్ల నుంచి సేకరించిన వ్యర్థాలలో సగటున 300 గ్రాముల తడి, పొడి వ్యర్థాలు ఉత్పత్తి అవు తాయని అంచనా వేస్తున్నారు. డంపింగ్ యార్డుల్లో తడిచెత్తతో సేంద్రియ ఎరువులను తయారు చేసి నర్సరీల్లో మొక్కల పెంపకానికి వినియోగించడంతో పాటు ఇతరులకు విక్రయించనున్నారు. పొడి చెత్తను తుక్కు దుకాణ నిర్వాహకులకు విక్రయించి వచ్చిన డబ్బులను జనరల్ ఫండ్కు జమ చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక రిజిస్టర్ను నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను ఎంపీఓ, డీఎల్పీఓ, డీపీఓ స్థాయిలో తనిఖీ చేయనున్నారు. ఈ మేరకు పల్లెప్రగతి యాప్లో కొత్త ప్రణాళికలను అప్డేట్ చేయనున్నారు.
రోజూ వారి నివేదిక యాప్లో నమోదు
జిల్లాలో 486 గ్రామ పంచాయతీలు ఉండగా వీటి పరిధిలో 1,272 జోన్లను ఏర్పాటు చేశారు. పంచాయతీల్లో జోన్లను సూచిస్తూ పారిశుద్ధ్య మ్యాప్ను ఏర్పాటు చేయాలి. జోన్ల పరిధిలోని నివాస గృహాలు, మురుగు కాలువలు, సీసీ రోడ్ల పొడవు, ఖాళీ స్థలాలను మ్యాప్లో ప్రదర్శించాలి. షెడ్యూల్ ప్రకారం ఒక జోన్ పరిధిలో కార్మికులతో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించి మరుసటిరోజు మరో జోన్ పనులు ప్రారంభించనున్నారు. చక్రీయ పద్ధతి(సైక్లిక్ మెథడ్)లో మళ్లీ అవే జోన్లలో పారిశుద్ధ్య పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. రోజూవారీ పారిశుద్ధ్య నివేదిక(డీఎస్ఆర్)ను యాప్లో నమోదు చేయనున్నారు.
పంచాయతీల్లో స్వచ్ఛతను
పెంపొందించేందుకు ప్రణాళిక
గృహాలు, విస్తీర్ణం, కార్మికుల
సంఖ్యను బట్టి జోన్ల సంఖ్య
చిన్న పంచాయతీల్లో కనిష్టంగా రెండు, మేజర్ పంచాయతీల్లో గరిష్టంగా నాలుగు జోన్ల చొప్పున ఏర్పాటు
జిల్లాలో ఇలా..
గ్రామ పంచాయతీలు 486
ఏర్పాటు చేసిన జోన్ల సంఖ్య 1,272
పల్లెల్లో పారిశుద్ధ్య జోన్లు


