పట్టుకున్నారు.. వదిలేశారు..!
మట్టి మాఫియాకు రాజకీయ నేతల అండదండలు
రెండు నెలల 20 రోజులకు
రూ. 75 వేలు
తమ సంతకాలను ఫోర్జరీ చేయడాన్ని తీవ్ర నేరంగా పరిగణించి క్రిమినల్ కేసులు నమోదు చేయించాల్సిన మైనింగ్శాఖ అధికారులు కాసులకు కక్కుర్తిపడి మైనింగ్ మాఫియాతో కుమ్మకై ్కయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 20 రోజుల పాటు మట్టి తవ్వకానికి అనుమతించిన అధికారులు దాని కోసం రూ. 2 లక్షలు వసూలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి, అధికారుల ఉత్తర్వులు ఫోర్జరీ చేసి రెండు నెలల 20 రోజుల పాటు అక్రమంగా మట్టిని తరలించిన వారికి అధికారులు వేసిన ఫైన్ కేవలం రూ.75 వేలు మాత్రమే. నిబంధనల ప్రకారం దాదాపు రూ.10 లక్షల జరిమానా విధించవచ్చు. కానీ ప్రొక్లెయిన్కు రూ. 50 వేలు, ఐదు టిప్పర్లకు కలిపిరూ. 25 వేలు ఫైన్ మాత్రమే వేశారు. మైనింగ్శాఖ అధికా రులు ఫిర్యాదు చేయలేదు కాబట్టి పోలీసులు కేసునమోదు చేయలేదని చెబుతున్నారు.
కోదాడ : కోదాడ కేంద్రంగా సాగుతున్న మట్టిమాఫియా కొత్త పుంతలు తొక్కుతోంది. ఏకంగా జిల్లా అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాలనే ఫోర్జరీ చేసి ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా లక్షలు విలువైన మట్టిని రాత్రి పగలు అనే తేడా లేకుండా మూడు నెలలుగా తరలించుకు పోతోంది. అయితే మట్టి మాఫియాపై ఫిర్యాదులు రావడంతో జిల్లా మైనింగ్ శాఖ అధికారులు నాలుగు రోజుల క్రితం ఆకస్మికదాడి చేసి రెడ్హ్యాండెడ్గా ఒక ప్రొక్లెయిన్, ఐదు ట్రిప్పర్లను పట్టుకున్నారు. ఈ సమయంలో తాము అనుమతి ఇచ్చిన పత్రాలను ఫోర్జరీ చేసి తేదీలను మార్చివేసి రెండు నెలలకు పైగా అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, కేసులు పెడతామని చెప్పారు. కానీ ఏమైందో ఏమోగాని సదరు మట్టి దందారాయుళ్లపై కనీసం పిటీ కేసు పెట్టకుండా నామమాత్రపు జరిమానాతో అధికారులు వదిలేశారు.
మైనింగ్శాఖ ఉత్తర్వులనే మార్చారు
కోదాడ మండల పరిధిలోని కూచిపూడి వద్ద సర్వేనంబర్ 615లో ఉన్న ప్రభుత్వ భూమిలో తాత్కాలిక మైనింగ్ చేసుకొని 1000 మెట్రిక్ టన్నుల మట్టిని తవ్వడానికి సీహెచ్. వెంకయ్య అండ్ కంపెనీకి జిల్లా మైనింగ్శాఖ అధికారులు జనవరి 16న అనుమతిని మంజూరు చేశారు. దీన్ని వీరు 2025 జనవరి 16 నుంచి 2025 ఫిబ్రవరి 4 మధ్యలోనే తవ్వుకోవాల్సి ఉంటుంది. దీని కోసం వీరు ప్రభుత్వానికి రూ.2 లక్షల రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇంత వరకు బాగానే ఉన్నా మట్టిదందా చేసేవారు మైనింగ్శాఖ ఇచ్చిన అనుమతి పత్రాలలోని తేదీలను మార్చి అధికారి సంతకంతో ఫోర్జరీ పత్రాలను సృష్టించారు. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 04 వరకు ఉన్న అనుమతిని జనవరి16 నుంచి జూన్ 04 వరకు అంటే అదనంగా నాలుగు నెలల పాటు వారే పొడిగించుకున్నారు. ఈ అనుమతి పత్రాలను చూపుతూ యథేచ్ఛగా మట్టిని వెంచర్లకు తరలించి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు.
రెండున్నర నెలల తరువాత..
కూచిపూడి వద్ద ప్రభుత్వ భూమిలో అక్రమంగా మైనింగ్ జరుగుతున్న విషయాన్ని స్థానికులు అనేకసార్లు ఫిర్యాదు చేసినా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. అది తమపని కాదంటే తమ పని కాదని ఆయాశాఖల అధికారులు ఒకరిపై ఒకరు చెబుతూ వస్తున్నారు. మట్టితోలకం అనుమతి ఫిబ్రవరి 4నే ముగిసింది.గడువు ముగిసిన రెండున్నర నెలల తరువాత అధికారులు కళ్లుతెరిచి ఈనెల 25న మైనింగ్శాఖ ఇన్చార్జి ఏడీ విజయరామరాజు ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. తమ శాఖ ఇచ్చిన ఉత్తర్వులను ఫోర్జరీ చేసిన విషయాన్ని గుర్తించారు. సంఘటనా స్థలంలో ఉన్న ప్రొక్లెయిన్, ఐదు ట్రిప్పర్లను సీజ్ చేశారు. తమ ఉత్తర్వులను ఫోర్జరీ చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి కోదాడ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మైనింగ్శాఖ అధికారులు వచ్చారు. మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు మంతనాలు జరిపి ఫిర్యాదు చేయకుండా వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఫ అనుమతి పత్రాలను ఫోర్జరీ చేసినా కేసు నమోదు చేయని అధికారులు
ఫ రూ. 75 వేల జరిమానాతోనే సరి
ఫ ఫిర్యాదు అందలేదంటున్న పోలీసులు
ఫిర్యాదు చేయలేదు.. ఫైన్ వేశారు
మైనింగ్శాఖ అధికారులు మట్టి తవ్వకాలపై మాకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. పట్టుకున్న వాహనాలలో ప్రొక్లెయిన్కు రూ.50 వేలు, ఐదు టిప్పర్లకు రూ.25 వేలు జరిమానా విధించారు.
– అనిల్రెడ్డి, కోదాడ రూరల్ ఎస్ఐ
పట్టుకున్నారు.. వదిలేశారు..!
పట్టుకున్నారు.. వదిలేశారు..!


