
దొంగతనాల నివారణకు ప్రత్యేక నిఘా
ఫ ఎస్పీ నరసింహ
సూర్యాపేటటౌన్ : దొంగతనాల నివారణకు ప్రతిరోజూ తనిఖీలు, పెట్రోలింగ్ నిర్వహిస్తూ పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టిందని జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి సెలవుల్లో చాలామంది దూర ప్రాంతాలకు వెళుతుంటారని, ఈ క్రమంలో ఇంటివద్ద తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై పోలీసుల సూచనలు పాటించాలని ప్రజలను కోరారు. ఎక్కువ రోజులు ఇళ్లు వదిలి వెళ్ళేవారు ఇరుగుపొరుగు వారికి, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఇంటికి అలారం సిస్టమ్ పెట్టుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని మొబైల్ ఫోన్ ద్వారా చూసుకోవాలని సూచించారు. ఆరుబయట మేడపైన పడుకునే వారు మెడలో ఆభరణాలు ఉంటే జాగ్రత్తగా ఉండాలని, వాకిట్లో ముగ్గులు వేసే సమయంలో ఆభరణాలను చీర పైటతో కవర్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఎవరైనా అపరిచితులు అడ్రస్ అడుగుతూ ఏమార్చి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయంలో స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రజా సమస్యలపై
నిరంతర పోరు
చిలుకూరు : ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతరం పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో నిర్వహించిన పార్టీ గ్రామ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హత కలిగిన ప్రతిఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. అనంతరం గ్రామంలో రెండు నూతన గ్రామ శాఖ కమిటీలను ఎన్నుకున్నారు. గ్రామ శాఖ కార్యదర్శులుగా బెజవాడ వినోద్, తాళ్లూరి వెంకటయ్య, సహా కార్యదర్శులుగా కడారి నరేష్, అలవాల రాజేష్తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. సమావేశంలో మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, చేపూరి కొండలు, సాహెబ్ అలీ, చిలువేరు అంజనేయులు, పిల్లుట్ల కనకయ్య, తాళ్లూరి మట్టయ్య, పెదమల్లయ్య, ఖాజామియా, నాగయ్య పాల్గొన్నారు.
తొలిదశ ఉద్యమకారుల
సమస్యలు పరిష్కరించాలి
సూర్యాపేట అర్బన్ : తెలంగాణ తొలిదశ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని 1969 తొలిదశ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ తొలిదశ ఉద్యమకారులతో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలతో పాటు వారికి గౌరవ పెన్షన్, ఇళ్ల స్థలాలు, ఉచిత వైద్య సదుపాయంతో పాటు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. కార్యక్రమంలో తొలి తెలంగాణ ఉద్యమకారులు దేవత్ కిషన్ నాయక్, కక్కిరేణి వెంకన్న, వున్నం సత్యనారాయణ, హజారి రంగయ్య, కొల్లూరి రామారావు, బందు రుద్రమ్మ, చిత్రం భద్రమ్మ, బత్తుల మల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి : మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని పూర్తిచేసి నిత్యకల్యాణం నిర్వహించారు. అదే విధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ప్రవేశం తరువాత మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు.

దొంగతనాల నివారణకు ప్రత్యేక నిఘా