
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్
హుజూర్నగర్: హుజూర్నగర్లో ఈనెల 16న తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమావేశానికి టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సుప్రీంకోర్టు అడ్వకేట్ నిరూప్రెడ్డి, హైకోర్టు అడ్వకేట్ దామోదర్రెడ్డి, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి హాజరుకానున్నారు. ఈమేరకు టీజేఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ దొంతిరెడ్డి శ్రీనివాస రెడ్డి మంగళవారం తెలిపారు. సీఎం కేసీఆర్ పాలన, తెలంగాణ పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
పారదర్శకంగా
రెండో విడత ర్యాండమైజేషన్
దురాజ్పల్లి (సూర్యాపేట): ఎన్నికల నేపథ్యంలో పీఓ, ఏపీఓల రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాల సాధారణ పరిశీలకుడు బాలకిషన్ ముండా, కోదాడ, హుజూర్నగర్ నియోజక వర్గాల సాధారణ పరిశీలకుడు కౌశిగన్, పోలీస్ పరిశీలకుడు ఫర్హాత్ అబ్బాస్, ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ సీహెచ్ ప్రియాంకలతో కలసి పీఓ, ఏపీఓల రెండవ విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు నియోజకవర్గాల్లో పీఓ, ఓపీఓలకు ఎన్నికల నిర్వహణ, విధివిధానాలపై మాస్టర్ ట్రైనర్స్తో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో గుర్తించిన 640 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్తో పాటు 210 కేంద్రాల్లో బయట కూడా వెబ్ క్యాస్టింగ్ చేపట్టనున్నట్లు వివరించారు.
విద్యార్థులు
ఉన్నత లక్ష్యంతో చదవాలి
సూర్యాపేటటౌన్: విద్యార్థులు చిన్నతనం నుంచే ఉన్నత లక్ష్యంతో చదవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీవాణి అన్నారు. మంగళవారం జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని విద్యాభారతి ఉన్నత పాఠశాలలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలన్నా, సమాజం, కుటుంబం పురోగతి సాధించాలన్నా, విద్యార్థులు మంచి లక్ష్య సాధనతో ఎదిగినప్పుడే సాధ్యమవుతుందని తెలిపారు. సమాజం సన్మార్గంలో నడిచినప్పుడు నేర ప్రవృత్తి తగ్గి మంచి వ్యవస్థ ఏర్పడుతుందని చెప్పారు. కాగా.. చిన్నారులు వివిధ వేషధారణల్లో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది జె.శశిధర్, న్యాయవాదులు సత్యనారాయణ పిళ్లె, బొల్లెద్దు వెంకటరత్నం, ప్రవీణ్కుమార్, పెండెం వాణి, నరేందర్రెడ్డి, పద్మజ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ నిర్ణయాన్ని
ధిక్కరిస్తే వేటు తప్పదు
హుజూర్నగర్: పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే వేటు తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. మంగళవారం హుజూ ర్నగర్లోని సీపీఎం కార్యాలయంలో పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎం నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంటూ, పార్టీకి నష్టం చేస్తున్న జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రవి నాయక్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు ఎన్.పాండు, ఎన్.వెంకటేశ్వర్లు, కె.గోపి, పల్లె వెంకటరెడ్డి, డి.బ్రహ్మం, వి.సైదులు, పాండు, యాకోబు, హుస్సేన్, రాంబాబు, శీలం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి

మాట్లాడుతున్న జిల్లా సీనియర్ సివిల్ జడ్జి శ్రీవాణి