జి.సిగడాం: నడిమివలస–గదబపాలెం గ్రామ సమీపంలో ఉన్న కొండలో సుమారు 202 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని, తక్షణమే ఈ ఆలోచనలు విరమించుకోవాలని నడిమివలస భూముల రక్షణ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జి.సిగ డాం తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండను ఏపీఐఐసీ పారిశ్రామికవాడ గా ఏర్పాటు చేయడానికి, సర్వే నంబరు 36.38లో 202 ఎకరాల్లో ఎన్ఈఆర్ సివికాన్ కంపెనీకి ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొండను ఇచ్చేది లేదన్నారు. అనంతరం తహసీల్దార్ మహాదేవు సరిత, ఎంపీడీఓ గుంటముక్కల రామకృష్ణారావులకు వినతిపత్రాలను అందించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు ఇజ్జి రోతు రమేష్, యడ్ల గౌరీనాయుడు, వంకల గణపతి, అప్పలనాయుడు, రవి, జగదీశ్వరరావు, దాలినాయుడు సత్యంనాయుడు, అప్పల సూరి, రమణ, నారాయణరావు, అప్పన్న, సూరి, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.


