నేను విజయవాడలోని గాయత్రి నగర్ చైతన్య కాలేజీలో ఇంటర్ చదివాను. జువాలజీ సబ్జెక్టుకు రమణమూర్తి, కెమిస్ట్రీ వెంకటరావు లెక్చరర్లు వచ్చేవారు. వీరిద్దరూ నాకు బాగా ఇష్టం. నా కెరీర్లో వారిని మర్చిపోలేను. స్వతహాగా మా నాన్న అప్పయ్య కూడా ప్రభుత్వ టీచర్.
– నక్క సాయి నీరజ్ కుమార్,
వంశధార కాలనీ, నరసన్నపేట
ఇప్పుడు నేను ఏజీబీఎస్సీ చదువుతున్నాను. నేను టెన్త్ చదివేటప్పుడు సైన్స్ టీచర్ కరుణా మేడమ్ అంటే ఇష్టం. నాపై ప్రత్యేక శ్రద్ధ చూపే వారు. ఇప్పటికీ ఆమెను మరిచి పోలేను.
– పాగోటి మానస, లక్ష్మీనగర్ –1,
నరసన్నపేట
నేను చదువుతున్న రోజు ల్లో మా ఉపాధ్యాయులు కొంత మంది అందజేసిన ప్రోత్సాహం మరువలేనిది. టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు పైడి హరనాథరావు తెలుగు పాఠాలు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాయి. ముఖ్యంగా టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోటనీ లెక్చరర్ తంగుడు నారాయణరావు ఎంతగానో ప్రోత్సహించారు. వీరితో పాటు సోషల్ ఉపాధ్యాయుడు సూర్యారావు, త్రినాథరావు మాస్టారు, చక్రధరరావు మాస్టారు మంచిగా పాఠాలు చెప్పేవారు. వీరితో పాటు మేము ట్యూషన్కు వెళ్లేవాళ్లం. అక్కడ నగేష్ మాష్టారు, కృష్ణారావు మాస్టారు మా పై ప్రత్యేక దృష్టి సారించి విద్యాబుద్ధులు నేర్పేవారు. ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నామంటే, అప్పట్లో ఉపాధ్యాయులు అందజేసిన ప్రోత్సాహం ఎంతో వెన్నుదన్నుగా నిలిచాయి.
– బీఆర్కే మహరాజ్,
చిన్నపిల్లల వైద్య నిపుణుడు, టెక్కలి
ఏడో తరగతిలో ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మానేసి గొర్రెలు మేపేందుకు వెళ్లిపోయాను. నా పరిస్థితిని తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు నరేంద్రనాథ్ పట్నాయక్ మాస్టర్ స్వయంగా నా దగ్గరకు వచ్చి మళ్లీ బడికి తీసుకువచ్చారు. చదువుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తానని ఆయన ఇచ్చిన భరోసా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఆయన ప్రోత్సాహంతోనే నేడు తొమ్మిదో తరగతి చదువుతున్నాను. నా జీవితాన్ని మార్చిన నరేంద్ర మాస్టారే నా హీరో. ఆయనను జీవితాంతం మరచిపోలేను.


