హిరమండలం వంశధార గొట్టా బ్యారేజీ వద్ద ఆదివారం ఉదయానికి స్వల్పంగా వరద నీరు పెరిగింది. ఒడిశా కేచ్మెంట్ ఏరియాతో పాటు గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు వంశధారలో వరదనీరు వచ్చిచేరుతోంది. గొట్టా బ్యారేజీ వద్ద గరిష్టంగా 38.10 మీటర్లు నీటిమట్టం ఉండగా ప్రస్తుతానికి 37.20 మీటర్ల నీటిమట్టం ఉంది. బ్యారేజీలోకి ఇన్ఫ్లో శనివారం సాయంత్రానికి 2200 క్యూసెక్కులు నీరు వచ్చి చేరింది. ఆదివారం ఉదయం నాటికి 19,500 క్యూ సెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. సాయంత్రానికి 20,217 క్యూసెక్కులకు పెరిగింది. వచ్చిన నీటిని 10గేట్లు 20 సెంటీమీటర్లు మేర పైకి ఎత్తి దిగువకు 18,437 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్లు డీఈ సరస్వతి, ఏఈ ఆనందరావు తెలిపారు. అలాగే కుడి ప్రధాన కాలువ ద్వారా 458 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాలువ ద్వారా 1322 క్యూసెక్కులు నీటిని విడిచిపెట్టినట్లు డీఈ తెలిపారు. – హిరమండలం


