● లివర్సిరోసిస్తో
బాధపడుతున్న జోష్వర్ధన్
● వైద్యం కోసం రూ.50 లక్షలు అవసరం
● దాతల కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు
జి.సిగడాం : పదో తరగతి పూర్తి చేసిన ఆ యువకుడికి పెద్ద కష్టం వచ్చిపడింది. ఇంటర్మీడియెట్లో జాయినై ఉన్నత చదువులు చదవాలన్న కలకు అరుదైన వ్యాధి రూపంలో బ్రేక్ పడింది. చికిత్సకు రూ.50 లక్షలకు పైగా డబ్బులు అవసరం పడటంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలంటూ దాతలపైనే భారం వేశారు.
ఏం జరిగిందంటే..
జి.సిగడాం మండలం ఎందువ గ్రామానికి చెందిన కింజరాపు భాస్కరరావు, రమా దంపతులకు కుమారుడు జోష్ వర్ధన్. వయస్సు 15 సంవత్సరాలు. ప్రభుత్వం పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. ఇంటర్ చదవాలనుకున్న సమయంలో లివర్సిరోసిస్ అనే అరుదైన వ్యాధి సోకింది. ఈ వ్యాధి నయంకావాలంటే సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు నిరాశలో కూరుకుపోయారు. పేద కుటుంబం కావడంతో ఆపరేషన్ చేయించలేకపోవడంతో జోష్వర్ధన్ మంచానికే పరిమితమయ్యారు.
ఆస్పత్రుల్లో చూపించినా..
జోష్వర్ధన్ రెండేళ్లుగా వ్యాధితో పోరాటం చేస్తున్నాడు. విశాఖ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని ప్రముఖ ఆస్పత్రుల్లో చూపించారు. వ్యాధి నివారణ చేయాలంటే ప్రత్యేక ఆపరేషన్ చేయాలని విశాఖలోని ఓ ప్రవేట్ ఆస్పత్రి వైద్యులు తెలియజేశారు. ప్రస్తుతం ప్రతి నెలా మందులు, వైద్య పరీక్షల కోసం సమారు రూ.30 వేలు వరకు ఖర్చు అవుతోందని, ఆపరేషన్ కోసం దాతలు స్పందించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సాయం కోసం..
దాతలు 99515 95285 నంబర్కు ఫోన్పే చేయవచ్చు. యూనియన్ బ్యాంకు (ఖాతా నంబరు 016610100122026, ఐఎఫ్ఎస్సీ కోడ్ యూబీఐఎన్0801666) ద్వారా కూడా సాయం అందించవచ్చు.


