డైనా సేవలకు
డైనాకు నివాళులు అర్పిస్తున్న పోలీసు సిబ్బంది
ఎచ్చెర్ల: శ్రీకాకుళం పోలీసు శాఖలో గత ఎనిమిదేళ్లుగా విశిష్ట సేవలందించిన పోలీసు జాగిలం డైనా గురువారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందినట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసు క్వార్టర్స్ ఆవరణలోని శ్మశానవాటికలో పోలీసు అధికార లాంఛనాలతో డైనా అంత్యక్రియలు నిర్వహించారు.
డైనా సేవలివే..
● ఈ జాగిలం లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందినది.
● డైనా 2017 సంవత్సరంలో జన్మించి 2018 సంవత్సరంలో మంగళగిరిలో డాగ్ ట్రైనింగ్ సెంటర్లో ఎక్స్ప్లోసివ్ డిటెక్షన్ స్నిఫర్ డాగ్గా ప్రత్యేక శిక్షణ పొందింది.
● 2018 నుంచి శ్రీకాకుళం జిల్లాలోని విధు లు నిర్వహించి వాసన ఆధారంగా పేలుడు పదార్థాలు, కీలక ఆధారాలను గుర్తించడంలో అసాధారణ ప్రతిభను కనబరిచింది.
● వీఐపీ, వీవీఐపీ పర్యటనలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, చెక్పోస్టు తనిఖీలు భారీ బందోబస్తు విధుల్లో కీలక పాత్ర పోషించింది.
● స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు సందర్భంగా నిర్వహించే పోలీసు పరేడ్లలో పాల్గొని విన్యాసాలతో అలరించేది.
సేవలు చిరస్మరణీయం
అదనపు ఎస్పీ ఎల్.శేషాద్రి మాట్లాడుతూ పేలుడు పదార్థాల గుర్తింపు, భద్రతా తనిఖీలు, పోలీసు విధుల్లో అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పోలీసు శాఖకు డైనా అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శంకర్ప్రసాద్, అర్ఎస్ఐలు, పోలీసు డాగ్ హ్యాండ్లర్ మాధవరావు, ఏఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


