● మరణంలోనూ వీడని దాంపత్య బంధం ● ఒకరి వెనుక ఒకరు ప్రాణాలు వదిలిన దంపతులు
ఎచ్చెర్ల: డబ్బై ఏళ్ల దాంపత్య జీవితం. యుక్త వయసులో పెళ్లి.. ముచ్చటగా ముగ్గురు బిడ్డలు.. వాళ్ల కు పెళ్లిళ్లు.. మళ్లీ వారికి పిల్లలు.. జీవితంలో అన్ని దశలను జంటగా చూశారు. అన్ని కష్టాలను కలిసి దాటారు. ఏడు దశాబ్దాలు అన్యోన్యంగా మెలిగి బతుకు పంటను చక్కగా పండించుకున్నారు. చావు పలకరించినపుడు కూడా ఒకరి వెంట ఒకరు కదిలి వెళ్లిపోయారు. ఎచ్చెర్ల మండలంలోని ధర్మవరం పంచాయతీ, రామజోగిపేట గ్రామానికి చెందిన పిల్లాటి దాలప్పడు (89), కాంతమ్మ (79) సోమవారం మృతి చెందారు. డబ్బై ఏళ్లుగా తోడూనీడగా బతికిన దంపతులు ఒకే రోజు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ధర్మవరం గ్రామంలో ఈ దంపతులు ఉంటున్నారు. సోమవారం రాత్రి 10 గంటల సమ యంలో దాలప్పడు బాత్రూమ్కి వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా కిందపడి కుప్పకూలిపోయారు. అది చూసిన పెద్ద కుమారుడు భాస్కరరావు వచ్చి బోరున విలపించాడు. ఆ రోదన విన్న దాలప్పడు భార్య కాంతమ్మ కూడా కుప్పకూలిపోయారు. అప్పటికే ఆమె కేన్సర్తో బాధ పడుతున్నారు. కుటుంబ సభ్యులు ఇద్దరినీ 108లో రిమ్స్కు తరలించారు. కానీ అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మంగళవారం గ్రామంలో ఇద్దరి మృత దేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.


