కంచిలి: మండలంలోని గోకర్ణపురం కాలనీకి చెందిన బల్ల వైకుంఠరావు(40) అనే వ్యక్తి రెండు కిడ్నీలు పాడై బుధవారం మృతి చెందారు. మృతుడు చైన్నెలో ఉపాధి పొందుతుండేవాడు. సుమారు మూడు నెలల క్రితం వ్యాధిని గుర్తించాడు. అనారోగ్యం ఏర్పడడంతో విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతుండేవాడు. అయితే ఆయన మృతి చెందడంతో చితికి భార్య గౌరి తలకొరివి పెట్టింది. వారి పెద్ద కుమారుడు చరణ్ విజయనగరంలోని బాలాజీ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా మొదటి సంవత్సరం చేస్తున్నాడు. పరీక్షలు రాస్తుండడంతో రావడం కుదరకపోవడం, ఆరో తరగతి చదువుతున్న కుమార్తె హారిక ఇంటి వద్దే ఉన్నప్పటికీ.. తనకు కూడా గుండెలో రంధ్రం ఏర్పడడంతో అనారోగ్యంతో ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితిల్లో మృతుని భార్యే చితికి నిప్పు పెట్టింది. పేద కుటుంబానికి చెందిన యజమాని మృతి చెందడం, మరోవైపు మృతిని కుమార్తె కూడా గుండె జబ్బుతో బాధపడుతుండడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.


