ఇచ్ఛాపురం రూరల్: వ్యక్తిగత కక్షలు పెంచుకున్న బంధువులు విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తపై కర్రతో దాడి చేసిన ఘటన మండలంలో కలకలం సృష్టించింది. స్థానిక రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాయితారి అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న లోపింటి లక్ష్మీభాయికి, సమీప బంధువులు కోళ్ల మన్మథరావు, తేజేశ్వరి దంపతులకు కాలువ విషయమై వ్యక్తిగత సమస్యతో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కార్యకర్త లక్ష్మీభాయి వద్దకు వెళ్లిన మన్మథరావు దంపతులు వాగ్వాదానికి దిగారు. వీరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో సహనం కోల్పోయిన దంపతులు.. కర్రతో లక్ష్మీభాయి తలపై దాడి చేయడం తీవ్ర రక్తస్రావమైంది. దీంతో స్పందించిన స్థానికులు హుటాహుటిన ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రిలో చేర్పించారు. రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ జనార్థనరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


