పలాస: ఒడిశా నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న చిత్తూరు జిల్లా ఐర్లా మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను శుక్రవారం కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ విలేకరులకు వివరాలు వెల్లడించారు. గుండ్లపల్లి గ్రామానికి చెందిన రంబే మునికుమార్, అతని భార్య మెందరికుర్తి నందిని, ఆమె అన్నయ్య మెందరికుర్తి రామకృష్ణలు ఒడిశా నుంచి గంజాయి తీసుకొని వచ్చి పలాస రైల్వే స్టేషన్లోకి వెళ్తుండగా ముందస్తు సమాచారం మేరకు కాశీబుగ్గ ఎస్ఐ ఎన్.సునీల్కుమార్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు. వారి వద్ద నుంచి గంజాయి, మూడు ఫోన్లు, రూ.2,490 నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ చెప్పారు.
146 మద్యం బాటిళ్లు స్వాధీనం
వజ్రపుకొత్తూరు రూరల్: బెండిగేట్ కూడలిలో అక్రమంగా నిల్వ ఉన్న 146 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పోలీసులు పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టగా చల్లా వినోద్కుమార్ షాపులో మద్యం సీసాలు అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించారు. దుకాణదారుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ బి.నీహర్ తెలిపారు.


