అసంబద్ధ ఉత్తర్వులు సరిచేయాలి
శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ల నియామక ఉత్తర్వుల్లో అసంబద్ధ విధానాలను సరిచేయాలని డీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు పేడాడ కృష్ణారావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పూజారి హరిప్రసన్న, ఎన్ని వెంకట ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. డివిజన్ పరిధి దాటి కొంతమంది ప్రధానోపాధ్యాయులను నియమించడం, సీనియర్లను విస్మరించి జూనియర్లను నియమించడం, మినహాయింపు అడిగిన వారి బాధలను పట్టించుకోకుండా బలవంతంగా నియమించడం వంటివి సరిచేయాలని కోరారు. ఐచ్చిక సెలవులు, స్థానిక సెలవుల విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారులను కాదని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకోవడం తగదన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
28న ఆదిత్యలో రాష్ట్రస్థాయి హ్యాకథాన్
టెక్కలి : టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 28న రాష్ట్ర స్థాయిలో ఐగానిట్ 3.0 రాష్ట్ర స్థాయి హ్యాకథాన్ సాంకేతిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాలేజీ డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల నుంచి సుమారు 150 జట్లు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, డీన్ ప్రసన్నలక్ష్మి, కన్వీనర్ రమేష్నాయుడు, స్వప్నరేఖ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
హిరమండలం: లక్ష్మీనర్సుపేట ఇందిరానగర్ కాలనీలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. మండాది తవిటయ్యకు చెందిన ఇల్లు కాలిపోయింది. నిత్యావసరాలతో పాటు రూ.30 వేల నగదు కాలిపోయింది. తవిటయ్య దంపతులు పొలం పనులకు వెల్లినప్పుడు విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. సర్పంచ్ దివాకర్నాయుడు, వీఆర్వో రమణమ్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
తాగునీటి నమూనాల సేకరణ
గార: శ్రీకాకుళం నగరంలో డయేరియా వ్యాప్తి నేపథ్యంలో నీటి నమూనాల సేకరణను జిల్లా పంచాయతీ అధికారి గోపిబాల గురువారం పరిశీలించారు. మేజర్ పంచాయతీ శ్రీకూర్మంలో వాటర్ ట్యాంకు పరిశుభ్రత, నీటి శాంపిల్స్ సేకరణపై ఆరా తీశారు. ట్యాంకు వద్ద పరిశుభ్రత చేసిన తేదీలను నమోదు చేయాలని, క్లోరినేషన్ పక్కాగా జరగాలన్నారు. ఆయన వెంట ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ చంద్రకళ, పంచాయతీ సెక్రటరీ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టంపై అవగాహన
శ్రీకాకుళం: పంచాయతీలను పర్యవేక్షించే డిప్యూటీ ఎంపీడీఓలు సమాచార హక్కు చట్టాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని జెడ్పీ సీఈఓ సత్యనారాయణ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అన్ని మండలాల ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, పరిపాలన అధికారులకు గ్రామ పంచాయతీ అభివృద్ధి పథకం శిక్షణలో భాగంగా సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రజలు స.హ.చట్టం దరఖాస్తులు ఎక్కువగా గ్రామ పంచాయతీలకు పంపిస్తున్నారని, సరైన అవగాహన లేక సమాచారం ఇవ్వడంలో జాప్యం జరిగి సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రిసోర్స్ పర్సన్ కొమ్మాజోస్యుల వసంతకుమార్ సమాచార హక్కు చట్టం నిబంధనలు, ఇతర అంశాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి గోపిబాల, జిల్లా పంచాయతీ వనరుల కేంద్ర అధికారి నిశ్చల పాల్గొన్నారు.
కాలిపోయిన ఇల్లు
అసంబద్ధ ఉత్తర్వులు సరిచేయాలి
అసంబద్ధ ఉత్తర్వులు సరిచేయాలి


