ఆహ్వానం
ఆదర్శ పాఠశాలల్లోకి..
● 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ● తుది గడువు మార్చి 31 ● ఏప్రిల్ 12న ప్రవేశపరీక్ష ● జిల్లాలో అందుబాటులో 13 మోడల్ స్కూళ్లు
పాతపట్నం:
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియం విద్యను అందించాలని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో సంకల్పించారు. ఆయన మరణానంతరం 2013లో అప్పటి ప్రభుత్వం ఆదర్శ పాఠశాల(మోడల్ స్కూల్)లను ప్రవేశపెట్టింది. ప్రవేశ పరీక్షలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తూ అత్యుత్తమ బోధన అందిస్తున్నారు. ఆరో తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు ఇంటర్మీడియెట్ వరకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన సాగిస్తున్నారు. కంప్యూటర్ ల్యాబ్, సైన్సు ల్యాబ్, డిజిటల్ క్లాస్రూమ్స్, గ్రంథాలయాలు, మరెన్నో సౌకర్యాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 13 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. జి.సిగడాం, పొందూరు, రణస్థలం, ఎచ్చెర్ల, తామాడ, ఓవీపేట, ఈదులవలస, సోంపేట, ఎంఎస్పల్లి, రాజపురం, పురుషోత్తపురం, కరవంజ, పాతపట్నంలోని ఒక్కో పాఠశాలలో 6వ తరగతిలో ఏటా 80 మంది విద్యార్థులకు 6వ తరగతిలో ప్రవేశాలు కల్పించేవారు. గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో అదనంగా 20 సీట్లు పెంచి మొత్తం 100 మందికి ప్రవేశాలు కల్పిస్తున్నారు.
దరఖాస్తు ఇలా..
2026 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదివిన వారై ఉండాలి. విద్యార్థులు ఏపీ ఆన్లైన్, ఇంటర్నెట్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.125 ఫీజు చెల్లించాలి. దరఖాస్తుతో పాటు ఆధార్, కులం ఆదాయం సర్టిఫికెట్లు, రేషన్కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, విద్యార్హత సర్టిఫికెట్ను ఆదర్శ పాఠశాలల్లో అందజేయాలి. మార్చి 31లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.
రిజర్వేషన్లు ఇలా..
15 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు, 20 శాతం బీసీలకు (7 శాతం బీసీ–ఎ, 10 శాతం బీసీ–బి, ఒక శాతం బీసీ–సీ, 7 శాతం బీసీ–డీ, ఒక శాతం బీసీ–ఈకు సీట్ల కేటాయింపులు ఉంటాయి. దివ్యాంగులకు మూడు శాతం, బాలికలకు 33.33 శాతం సీట్లు కేటాయిస్తారు. నిర్దేశించిన విభాగాల్లో అభ్యర్థులు లేకపోతే ఇతర గ్రూపుల నుంచి సీట్లు భర్తీ చేస్తారు. 50 శాతం సీట్లు ఇతర కులాలకు కేటాయించారు.
అధునాతన వసతి గృహాలు..
ఏపీ మోడల్ స్కూల్లో చేరిన విద్యార్థినులకు ఆధునాతన వసతి గృహాలను ఏర్పాటు చేశారు. విద్యార్థినులకు మోడరన్ మంచాలు, దుప్పట్లు, బెడ్షీట్లు అందిస్తున్నారు. హాస్టల్లో వంద మంది విద్యార్థినులకు ప్రవేశాలు కల్పిస్తారు. హాస్టల్లో ప్రత్యేక ట్యూటర్లను ఏర్పాటు చేస్తారు. బాలురుకు హాస్టల్ సదుపాయం ఉండదు.
ప్రవేశ పరీక్ష ఇలా..
ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 12న ఏపీ మోడల్ పాఠశాలలో ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించే దిశగా ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను నెలకొల్పింది. ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశం చక్కని అవకాశంగా విద్యార్థులు, తల్లిదండ్రులు భావిస్తున్నారు. అర్హత ఉన్న వారందరూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
– కె.వి.రత్నకుమారి,
ప్రిన్సిపాల్, ఏపీ మోడల్ స్కూల్, పాతపట్నం
ఆహ్వానం
ఆహ్వానం


