పర్యవీక్షణకు ఫలితమిది..
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో పనిచేసేందుకు కావాల్సినంత మంది ఇంజినీర్లు ఉన్నారు. అంతకు మించి శానిటేషన్ పర్యవేక్షణకు, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్లు ఉన్నాయి. శ్రీకాకుళం కార్పొరేషన్లో అందరికీ సురక్షితమైన మంచినీరు అందించేందుకు, పారిశుద్ధ్యాన్ని కాపాడేందుకు పుష్కలంగా అధికారులు ఉన్నా నగరవాసులకు నరకయాతన తప్పడం లేదు. 2025 డిసెంబర్ నెలలో బలగలో ఓ వ్యక్తి డయేరియాతో మృతి చెందాడు. అయినప్పటికి మున్సిపల్ అధికారులు మేలుకోలేదు. వీరి నిర్లక్ష్యమే దమ్మలవీధిలో జరిగిన సంఘటనలో నలు గురి ప్రాణాలు గాల్లో కలిసిపోడానికి కారణమైంది. ప్రభుత్వ ఆస్పత్రిలో అయితే ఒకేచోట లెక్క దొరికిపోతుందన్న ఆలోచనతో రిమ్స్, కిమ్స్, జెమ్స్, సింధూర వంటి ఆస్పత్రుల్లో డయేరియా బాధితుల్ని అడ్మిట్ చేసి లెక్కకు దొరక్కుండా అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం కేసుల వివరాలు దాచి పెట్టే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ సుమారు 150కి పైగా కేసులున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎందుకీ మౌనం..?
గత పది రోజులుగా కుళాయిల్లోంచి మురుగునీరు వస్తున్నా, స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణం. ఇంజినీరింగ్ విభాగంలో ఎంఈ, డీఈ, వాటర్సప్లై ఏఈలు ఉన్నప్పటికీ వారెవ్వరు పట్టించుకోలేదు. అసలు కుళాయి పైపులైన్లు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని కాలువల్లో ఉన్న పైపు లైన్లు పర్యవేక్షించిన దాఖలాలు లేవు. ఇంజినీర్లంతా కార్యాలయంలో తమకు కేటాయించిన సీట్లకే పరిమితమవ్వడమే తప్ప క్షేత్రస్థాయిలో పరిశీలన, పర్యవేక్షణ చేసిన సందర్భాలు లేవని నగర వాసులు మండిపడుతున్నారు. నగరంలో రోడ్ల విస్తరణ, కాలువల నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, కుళాయిలు పాడైపోకుండా, వాటిలో మురుగునీరు కలిసిపోకుండా చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అసవరం ఉంది. అవేమీ చేయకపోవడం వల్లే కాలువల్లో నీరు కుళా యి పైపు లైన్లలోకి వెళ్లిపోవడంతో డయేరియా వ్యాపించిందని నగరవాసులు మండిపడుతున్నా రు. అంతేకాకుండా పంపుహౌస్, ఇన్ఫిల్టరేషన్ వద్ద పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఆదివారంపేట పంపుహౌస్కి తలుపులు లేకుండా ఓ రేకు అడ్డుపెట్టి ఉంచారు. అక్కడ మిషనరీ విచ్చలవిడిగా పడేశారు.
ఇంజినీర్లు ఫుల్.. పర్యవేక్షణ నిల్
ఇంజినీరింగ్ విభాగంలో మున్సిపల్ ఇంజినీర్ (ఎమ్ఈ)–1, డిప్యూటి ఇంజినీర్లు (డీఈలు)– 3, అసిస్టెంట్ ఇంజినీర్లు (ఏఈలు)– 4, ఎమినిటి సెక్రటరీలు– 18మంది ఉన్నారు. కానీ వారంతా గ్రౌండ్లెవల్లో పర్యవేక్షణ మాత్రం చేయడం లేదు. కమీషన్లు వచ్చే పనులపైనే దృష్టి సారించి ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉండే కుళాయిలపైన, మంచినీరు సరఫరా చేయడంపైనా దృష్టి సారించలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు నగరంలో నిరంతరం పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాల్సిన హెల్త్ ఆఫీసర్ నిర్లక్ష్యం వల్లే ఈ రోజు వందలాది మంది డయేరియా బారిన పడ్డారని నగర వాసులే ఆరోపిస్తున్నారు. ఇంజినీరింగ్, ప్రజారోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటనకు ఇటీవల వచ్చిన మున్సిపల్ కమిషనర్ని బలిచేసి సస్పెండ్ చేసిన ప్రభుత్వ తీరుపై అధికార వర్గాలు, సామాన్య ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యమే ప్రజల ప్రాణం తీసింది
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇంజినీరింగ్, శానిటేషన్ సిబ్బంది కావాల్సినంతమంది ఉన్నారు. కానీ పర్యవేక్షణ లోపం వల్లే నగరంలో డయేరియా ప్రబలి నలుగురు మృతి చెందారు. వందలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఎక్స్గ్రేసియా ఇవ్వాలి. – టి.తిరుపతిరావు,
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
పర్యవీక్షణకు ఫలితమిది..


