మనసున్న మా రాణి
● విద్యార్థికి చూపు ప్రసాదించిన
టీచర్ సంధ్యారాణి
● ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించిన ఉపాధ్యాయిని
పలాస: గురువు అంటే అజ్ఞానం అనే చీకటిని పారదోలి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవారు. ఈ గురువు కూడా ఓ విద్యార్థి జీవితంలో ‘దురదృష్టం’ అనే చీకటిని వెళ్లగొట్టి ‘చూపు’ అనే వెలుగును ప్రసాదించారు. కంటి చూపు సరిగా లేక ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థినిని ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించి చూపును సరి చేయించారు. టీచర్ చేసిన ఈ పని ఆ విద్యార్థినికి కొత్త జీవితాన్నిచ్చింది. వివరాల్లోకి వెళితే..
కాశీబుగ్గ సూదికొండ పాఠశాలలో చదువుతున్న సమీర చిన్నప్పటి నుంచి కంటి చూపు సరిగా లేక బాధపడుతోంది. ఈ విషయాన్ని గమనించిన పాఠశాల ఉపాధ్యాయుని సంధ్యారాణి తల్లిదండ్రులను సంప్రదించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నతనం నుంచి కంటి సమస్య ఉందని, పేదరికం కారణంగా శస్త్ర చికిత్స చేయించలేకపోతున్నామని తల్లిదండ్రులు చెప్పా రు. విద్యార్థిని తండ్రి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం డయాలసిస్ స్టేజ్లో ఉన్నారు. తల్లి దినసరి కార్మికురాలిగా పనిచేస్తున్నారు. కుటుంబ దయనీయ పరిస్థితి తెలుసుకున్న సంధ్యారాణి చలించిపోయారు. సమీరకు ఎలాగైనా కంటి చూపు తెప్పించాలనే ఆలోచనకు వచ్చారు. భర్త కేవీవీఎస్ ప్రసాదరావుకు ఈ విషయం చెప్పింది. ఆయన పలువురు వైద్యులను సంప్రదించారు. చికిత్స ఖరీదైనప్పటికీ తక్కువ ఖర్చుతో చేసేందు కు డాక్టర్లను ఒప్పించారు. తాను కొంత మొత్తాన్ని చెల్లించారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులకు ఈ విషయం చెప్పి, వారి సహకారంతో విద్యాశాఖాధికారుల నుంచి అనుమతి తెచ్చుకొని సమీరను తీసుకొని సంధ్యారాణి విశాఖపట్నం ఆస్పత్రికి వెళ్లారు. విశాఖ ఐ ఆస్పత్రిలో డాక్టర్ గోపాలరాజు ఆధ్వర్యంలో కంటి వైద్య బృందంతో చేసిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఆ చిన్నారికి కంటి చూపు మెరుగైంది. ఆమె ఔదార్యాన్ని చూసి తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హాట్సాఫ్ చెబుతున్నారు.


